హైదరాబాద్: కేంద్రం నుంచి నిధులు తీసుకురానివారు మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవాచేశారు. కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నిక తెచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేటలో పలు అభివృద్ధి పనులను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచి ఏం చేశారని బీజేపీ నాయకులను నిలదీశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు.
రాజగోపాల్ రెడ్డి స్వార్ధంతోనే మునుగోడు ఉపఎన్నికలు వచ్చాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం తధ్యమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చూపించాలని డిమాండ్ చేశారు. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలను ప్రజలు నమ్మరన్నారు. ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉంటారని చెప్పారు.