హైదరాబాద్: సనత్నగర్లోని (Sanath nagar) అల్లాఉద్దీన్ కోటిలో దారుణ హత్యకు (Murder) గురైన బాలుడు వాహిద్ కుటుంబ సభ్యులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) పరామర్శించారు. బాలుడి మృతి చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. దోషులు ఎంతటివారైనా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ జరిగేలా చూస్తామన్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందన్నారు. ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలికానీ బాలుడిని హత్యచేయడం దారుణమని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బస్తీ వాసుల్లో భయాన్ని పోగొట్టేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.
సనత్నగర్ పారిశ్రామికవాడలోని అల్లాఉద్దీన్ కోటిలో రెడీమేడ్ దుస్తుల వ్యాపారి వసీంఖాన్ తన కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయన కుమారుడు వాహిద్ (8)ను స్థానికంగా నివసించే ఫిజాఖాన్ అనే ఓ హిజ్రా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిట్టీల వ్యాపారం నిర్వహించే ఫిజాఖాన్ వద్ద వసీంఖాన్ చిట్టీలు వేశాడు. దీనికి సంబంధించిన డబ్బును ఫిజాఖాన్ ఇవ్వకపోవడంతో గతకొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి మధ్య గురువారం కూడా వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో వసీంఖాన్ కుమారుడిని నలుగురు వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అతడిని ప్లాస్టిక్ సంచిలో తీసుకుని ఫిజాఖాన్ ఇంటి వైపునకు వెళ్లారు. అయితే రాత్రి పొద్దుపోయినా బాలుడు కనిపించకపోవడంతో తండ్రి వసీంఖాన్ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీ ఫుటేజీల ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు.
బాలుడి మృతదేహాన్ని జింకలవాడ సమీపంలోని ఓ నాలాలో వేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో స్థానికుల సాయంతో పోలీసులు నాలాలో వెతికారు. ఈ క్రమంలో ఓ ప్లాస్టిక్ సంచిలో మృతదేహం ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. బాలుడిని హత్య చేసిన నిందితులు.. ఎముకలను విరిచి ఓ బకెట్లో కుక్కారు. దానిని ఓ ప్లాస్టిక్ సంచిలో ఉంచి నాలాలో పడేశారు. ఈ ఘటనతో అల్లాఉద్దీన్ కోటి బస్తీలో ఉద్రిక్తత నెలకొన్నది.