సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ)/మారేడ్పల్లి : క్రీడాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ జోన్లో గురువారం జరిగిన జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను, సర్టిఫికెట్స్ను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతాయన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా, క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం ప్రతి యేటా వేసవిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ క్యాంపులను యువత సద్వినియోగపర్చుకొని రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయి వేదికలపై రాణించాలని ఆకాంక్షించారు.
స్పోర్ట్స్ అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు క్యాంపులను నిర్వహించామని, జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్లతోపాటు 915 ప్లే గ్రౌండ్లలో బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ షటిల్, బాడీ బిల్డింగ్, క్రికెట్, క్యారమ్, చెస్, ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్ హాకీ, కబడ్డీ, ఖోఖో వంటి 44 రకాల క్రీడల్లో శిక్షణ అందించినట్లు తెలిపారు.
చార్మినార్ జోన్, కూలీ కుతుబ్ షా స్టేడియం, సికింద్రాబాద్ మారేడ్పల్లి ప్లే గ్రౌండ్, కూకట్పల్లి- శేరిలింగంపల్లి జోన్ చందానగర్ పీజేఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం, ఎల్బీనగర్ జోన్ ఉప్పల్లో సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు, కోచ్లకు బహుమతులను, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందగిరి స్వామి యాదవ్, శశికళ, టీ మాధవి, ఆనంద్, డాకు నాయక్, కోచ్, క్రీడాకారులు పాల్గొన్నారు.