ఖైరతాబాద్, జనవరి 8 : పేదలకు వైద్య, ఇతర సహాయ సహకారాలు అందించడం ద్వారా సమాజంలో శాశ్వత గుర్తింపు లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్లోని ఆరాధన భవన్లో నమావత్ జైన్ ట్రస్ట్, కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య సేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఈవినింగ్ క్లినిక్ను మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగం సమాజంలోని పేదల కోసం ఖర్చు చేసి వారిని ఆదుకోవాలన్నారు. అనేక సంవత్సరాలుగా పేద ప్రజల కోసం పాటుపడుతున్న జైన్ సమాజ్ సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ స్వచ్ఛంధ సంస్థలు తమ వంతు సాయం చేస్తూ సేవలను విస్తరించాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం, అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పి.విజయా రెడ్డి, ట్రస్ట్ చైర్మన్ ఉత్తమ్ కుమార్ జైన్, ప్రమోద్ కుమార్ జైన్, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ భాస్కర్ రావు, శీనయ్య ట్రస్ట్ సభ్యులు మోతీలాల్ జైన్, గౌతం జైన్, బీఆర్ఎస్ నాయకులు మహేందర్ బాబు, ప్రవీణ్ కుమార్, మహేశ్ యాదవ్ పాల్గొన్నారు.