మణికొండ, మే 28 : ‘విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ అందరి వాడు..ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆయనకు అభిమానులే.. తెలుగుజాతి ఉన్నంతకాలం ఆ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది’ అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురికాలనీలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆదివారం మంత్రి శ్రీనివాస్యాదవ్ ఆవిష్కరించారు. చిత్రపురికాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహానటుడు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని సినీ కార్మికులకు నివాస స్థలంలో ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని, తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారని, ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలతో ప్రజాభిమానం పొందారని మంత్రి శ్రీనివాస్యాదవ్ గుర్తు చేశారు.
ఎన్నో సామాజిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి ప్రతి పాత్రకు ప్రాణప్రతిష్ట చేసిన గొప్ప నటుడు ఎన్టీఆర్ అని అన్నారు. తమ చిన్న తనంలో ఆయన నటించిన ఎన్నో చిత్రాలను చూసేవాళ్లమని గుర్తుచేశారు. తెలుగు ప్రజల ఆరాధ్యుడైన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చిత్రపురికాలనీలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయుడు మోహనకృష్ణ, సీనియర్ నటుడు మురళీ మోహన్, నిర్మాత సి.కల్యాణ్, దర్శకుడు ఎన్. శంకర్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఫిలిం చాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, మణికొండ మున్సిపాలిటీ కౌన్సిలర్ హైమాంజలి అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.