సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. శనివారం రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హౌసింగ్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. రెండు పడుకల గదులు, జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్ల కేటాయింపులో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
ఇండ్ల కేటాయింపులో మధ్యవర్తుల ప్రమేయాన్ని సహించేది లేదన్నారు. హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 ప్రాంతాలు, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 ప్రాంతాల్లో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద 3,422 ఇండ్లను నిర్మించగా అందులో 2,158 గృహాలను లబ్ధిదారులకు కేటాయించామన్నారు. ఇంకా 1264 ఇండ్ల కేటాయింపు పెండింగ్లో ఉందన్నారు. ఆర్డీఓ లేదా సీనియర్ అధికారుల పర్యవేక్షణలో తగు విచారణ జరిపి నిబంధనల ప్రకారం అర్హులైన వారిని గుర్తించి 10 రోజుల్లోగా మిగిలిన ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించాలని ఆదేశించారు.
ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పేద ప్రజల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిందని, వాటిని కూడా పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సంబంధిత తహసీల్దార్లు తమ పరిధిలో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి 10 రోజులలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేటలో గల గైదన్బాగ్లో సరైన సౌకర్యాలు లేక, ఇరుకు ఇండ్లలో నిరుపేదలు నివసిస్తున్నారని మంత్రి అన్నారు. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించేందుకు 4 రోజులలో సమగ్ర సర్వే నిర్వహించి ప్రణాళికలను సమర్పించాలని సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత, తహసీల్దార్ బాలశంకర్ను ఆదేశించారు.
నగరంలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి సమగ్ర సమాచారంతో నెల రోజుల్లో నివేదిక అందజేయాలని తహసీల్దార్లను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దేవాదాయ, రెవెన్యూ శాఖకు చెందిన స్థలాలకు సంబంధించి పలు కేసులు కోర్టులలో సంవత్సరాలుగా సాగుతున్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిషారమయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని అంబేదర్ నగర్, బండ మైసమ్మ నగర్ తదితర ప్రాంతాలలో కోర్టు కేసుల కారణంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నిలిచిపోయిందని, వీలైనంత త్వరగా కేసులు పరిషరించి ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు. సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సికింద్రాబాద్, హైదరాబాద్ ఆర్డీఓలు వసంత, వెంకటేశ్వర్లు, హౌసింగ్ ఎస్ఈ కిషన్, ఈఈ వెంకటదాసు రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ అధికారులు రమేష్, కమలాకర్, ఆశన్న, ఖాసీం, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.
నాలాల వెంట ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్న వారికి ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు. నాలాల వెంట ఉన్న వారికి ఈ విషయమై అవగాహన కల్పించి ఖాళీ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, లబ్ధిదారుల ఎంపిక సమాచారాన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు కచ్చితంగా తెలియజేయాలని సూచించారు.