బన్సీలాల్పేట, జూలై 14 : నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు రెండు పడక గదుల ఇండ్లు కట్టించి ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. బుధవారం బన్సీలాల్పేట డివిజన్ బండమైసమ్మ నగర్ లో కార్పొరేటర్ హేమలత, సికింద్రాబాద్ తాసిల్దార్ బాలశంకర్, బల్దియా డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి, హౌసింగ్ ఈఈ వెంకట్దాస్రెడ్డి, ఇతర అధికారులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని సందర్శించారు. అనంతరం లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రూ.28 కోట్లతో 336 ఇండ్ల నిర్మాణం జరుగుతున్నదని, పెద్దఎత్తున బండలు రావడం, కరోనా తదితర కారణాల వల్ల పనుల్లో జాప్యం జరిగిందన్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థికభారం పడకుండా పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో దీపావళి నాటికి నిర్మాణం పూర్తిచేసి ఇండ్లను కేటాయిస్తామన్నారు. మొత్తం 10 లిఫ్టులు ఏర్పాటు చేశామని, 13 దుకాణాలు నిర్మిస్తున్నామని, లాటరీ పద్ధతిన స్థానికులకే కేటాయిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు కే.లక్ష్మీపతి, ప్రేమ్కుమార్, వెంకటరమణ, దేశపాక శ్రీను, జ్ఞాని, ఫహీం, అబ్బాస్, గోవర్దన్, బండమైసమ్మనగర్ బస్తీ అధ్యక్షుడు జగదీశ్ పాల్గొన్నారు.