అమీర్పేట్, జూన్ 13: వేలాదిగా తరలివచ్చే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. దేవాలయం ఎదుట రూ.30లక్షల దాతల చేయూతతో నిర్మిస్తున్న భారీ షెడ్డు నిర్మాణ పనులను మంత్రి తలసాని, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, దేవాలయ ఫౌండర్ చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, దేవాలయ ఈవో ఎస్.అన్నపూర్ణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలిస్తున్న భక్తులకు సేదతీరేందుకు వీలుగా ఆలయం ఎదుట భారీ షెడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అదే విధంగా ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో తరలి వచ్చే భక్తులకు పార్కింగ్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్న తీరును గుర్తించి.. ఆలయ సమీపంలో బహుళ అంతస్తుల వాహనాల పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మితమవుతున్నదని గుర్తుచేశారు.