అమీర్పేట్, జూలై 11 : కాలనీల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే.. వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సనత్నగర్ డివిజన్లోని రవీంద్రనగర్లో ఆదివారం మంత్రి స్థానిక కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కాలనీవాసులు పడుతున్న మంచినీటి, డ్రైనేజీ సమస్యలను మంత్రికి తెలుపగా.. వెంటనే సంబంధించిన ఆయన పరిష్కార చర్యలు చేపట్టాలని సబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో పాటు సనత్నగర్, అమీర్పేట్ డివిజన్లలో చెత్త సేకరణ చేపడుతున్న ఆటోలు, రిక్షాలు తమ కాలనీ రోడ్లపై పార్కింగ్ చేస్తుండటంతో ఇరుకుగా ఉన్న కాలనీ రోడ్లపై ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నట్టు కాలనీవాసులు మంత్రికి వివరించారు. రవీంద్రనగర్ కాలనీ రోడ్లపై ఇబ్బందులు తొలగిపోయేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు కొలను బాల్రెడ్డి, రవీంద్రనగర్ కాలనీ అధ్యక్షుడు విజయ్సింగ్ తదితరులు పాల్గొన్నారు.