హైదరాబాద్ : ఎన్నో సంవత్సరాల నుంచి సనత్ నగర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు 210 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాణిగంజ్ లో రైల్వే బ్రిడ్జి (RUB) విస్తరణ, సనత్ నగర్ ROB, ఫతేనగర్ ఫ్లై ఓవర్ విస్తరణ (ROB) పనుల పురోగతిపై మంగళవారం బుద్ధ భవన్ లో రైల్వే, GHMC, ఎలెక్ట్రికల్ తదితర శాఖల ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం వీటి నిర్మాణం కోసం 210 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, అందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ప్రభుత్వం నూతన రోడ్ల నిర్మాణం, అండర్ పాస్లు, ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అందులో భాగంగానే సనత్ నగర్లోని ఇండస్ట్రియల్ ప్రాంతం నుంచి బాలా నగర్ వరకు అండర్ పాస్ నిర్మాణం కోసం ప్రభుత్వం 105 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని చెప్పారు. అదేవిధంగా అమీర్పేటలోని కనకదుర్గమ్మ దేవాలయం నుంచి ఫతేనగర్ ఫ్లై ఓవర్ వరకు రోడ్డు విస్తరణ చేసి ట్రాఫిక్తో వాహనదారులు ఇబ్బందులు లేకుండా చేసినట్లు తెలిపారు. ఫతే నగర్ ఫ్లై ఓవర్ పై కూడా ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటున్నందున ప్రస్తుతం ఉన్న 2 లైన్ ల రోడ్డును 4 లైన్ లుగా విస్తరించనున్నట్లు చెప్పారు.
అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి
ఈ పనులు చేపట్టేందుకు గాను అడ్డంకిగా ఉన్న రైల్వే ట్రాక్ల వద్ద RUB లను నిర్మించేందుకు రైల్వే, GHMC అధికారుల సమన్వయంతో చేపట్టాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలలో పనులు చేపట్టేందుకు అనువుగా కొన్ని ప్రాపర్టీస్ను కొన్ని సేకరించినట్లు తెలిపారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే సేకరించే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నెల రోజులల్లో పనులు ప్రారంభించే విధంగా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. అదేవిధంగా రాణి గంజ్ రైల్వే బ్రిడ్జి కూడా రోడ్డు కు తగినంత వెడల్పు లేకపోవడం వలన వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అక్రమ నిర్మాణాలను తొలగించి RUB పనులు చేపడుతామన్నారు.
ప్రజల ఇబ్బందులను గుర్తించి వాటిని పరిష్కరించడమే తమ లక్ష్యం అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, సనత్ నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మీబాల్ రెడ్డి, ఈఎన్సీ జియా ఉద్దిన్, చీఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్రప్రసాద్ నాయక్, హెచ్ఆర్డీసీఎల్ సీఈ సరోజ, ఖైరతాబాద్, నార్త్ జోన్ జోనల్ కమిషనర్లు వెంకటేష్ దోత్రే, రవి కిరణ్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, రైల్వేస్ డిప్యూటీ సీఈ మనోహర్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఎస్ఈ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.