హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో వర్షాకాల కార్యాచరణ ప్రణాళికపై మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రభుత్వం దృష్టి సారించింది. మేయర్, డిప్యూటీ మేయర్ పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా ఫ్లై ఓవర్లు, స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్లు నిర్మించామని తెలిపారు.
నగర అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను త్వరలోనే తొలగిస్తామన్నారు. నాలాలపై ఇండ్లు నిర్మించుకున్నవారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారిని పంపిస్తామన్నారు. నగరంలో 1,368 కిలోమీటర్ల మేర నాలాల అభివృద్ధి జరుగుతుందన్నారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో త్వరలోనే నాలాలపై వర్క్షాప్ నిర్వహిస్తామని చెప్పారు. ఓపెన్ నాలాల్లోని పూడికను మిషనరీ సహాయంతో తీస్తామని పేర్కొన్నారు. నాలాలు, చెరువులు ఆక్రమణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.