మణికొండ, డిసెంబర్ 29 : తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా సుపరిపాలనను అందిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మణికొండ మున్సిపాలిటీ చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మెగాస్టార్ చిరంజీవి, నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, సి.కళ్యాణ్, సినీ ప్రముఖులతో కలిసి 1,176 ఎంఐజీ, 180 హెచ్ఐజీ డూప్లెక్స్ ప్లాట్స్ ఓనర్స్తో గృహ ప్రవేశాలను చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సినీ రంగానికి ఇక్కడి కార్మికులకు తెలంగాణ సర్కారు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
చిత్రపురికాలనీ వాసులకు కనీస సౌకర్యాల కల్పనలో భాగంగా తాగునీటి వసతులను కల్పించేందుకు మిషన్ భగీరథ పైప్లైన్ వచ్చేలా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా కాలనీలోనే చౌకధరల దుకాణాల ఏర్పాటుతో పాటు హాస్పిటల్ భవనాన్ని నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. అర్హులంతా తమ ఓటరు నమోదును చేసుకోవాలని సూచించారు. సినీ హీరో చిరంజీవి మాట్లాడుతూ.. సినీ కార్మికుల సంక్షేమం కోసం దివంగత ఎం.ప్రభాకర్రెడ్డి దూరదృష్టితో సొసైటీ కోసం చేసిన కృషి అభినందనీయమన్నారు.
దేశంలోనే మరే సినీ పరిశ్రమలోనూ సినిమా కార్మికులకు ఇంత పెద్ద గృహసముదాయం లేదని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ కె.నరేందర్రెడ్డి, కౌన్సిలర్లు వల్లభనేని హైమాంజలి, వసంత్రావు చౌహాన్, చిత్రపురి కాలనీ కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్, కాలనీ ప్రతినిధులు ప్రభాకర్రెడ్డి, ప్రవీణ్కుమార్ యాదవ్, కార్యదర్శి పీఎస్ఎన్ దొర, కోశాధికారి లలిత, సభ్యులు పాల్గొన్నారు.