హైదరాబాద్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపును ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Srinivas Yadav) వెల్లడించారు. ముగింపురోజున ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ట్యాంక్బండ్పై 750 డ్రోన్లతో భారీ డ్రోన్ షో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మంగళవారం అంబేద్కర్ విగ్రహం వద్ద హోంమంత్రి మహమూద్ అలీ(Minister Mahamood), మేయర్ విజయలక్ష్మి(Mayor Vijaya Laxmi), డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, డీజీపీ(DGP) అంజనీ కుమార్, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాసరాజు లతో కలిసి ఏర్పాట్లను(Arrangements) పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ 22 వ తేదీన నగరంలోని అన్ని నియోజకవర్గాల నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు బైక్ ర్యాలీ చేరుకుంటుందని వెల్లడించారు.
అనంతరం వేలాదిమంది కళాకారులు నృత్యాలు, డప్పు చప్పుళ్లు, వివిధ వేషధారణలతో అమరవీరుల స్మారక కేంద్రం వరకు ర్యాలీ చేరుకుంటుందన్నారు. అనంతరం స్మారక కేంద్రాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR )ప్రారంభించి సభలో ప్రసంగిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా గడిచిన 9 సంవత్సరాలలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే విధంగా డ్రోన్ షో ఉంటుందని చెప్పారు. ఆరోజు సాయంత్రం ట్యాంక్ బండ్ పై రాకపోకలు నిలిపివేస్తున్నామని వివరించారు. మంత్రి వెంట కలెక్టర్ అమయ్ కుమార్, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, పలువురు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.