హైదరాబాద్ : మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. దశాబ్ది ఉత్సవాల (Decade Celebrations)సందర్భంగా ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్లో మెట్రో వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మంచినీళ్ల పండుగలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గ్రామాలల్లో తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడేవారని, పట్టణాలలో ట్యాంకర్ లు, వీధి నల్లాల వద్ద మహిళలు కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఖాళీ బిందెలతో రోడ్లపై ధర్నాలు చేయడం వంటివి నిత్యకృత్యంగా జరిగేవని చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో తాగు నీటి సమస్య తలెత్తకుండా రూ.13,546 కోట్ల వ్యయంతో నూతనంగా అదనపు పైప్ లైన్లు(Pipe Lines), రిజర్వాయర్ల(Reservoirs) నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.
కృష్ణా, గోదావరి జలాలతో రానున్న 50 సంవత్సరాల పాటు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి నిరంతరం నీటి సరఫరా జరిగే విధంగా సుంకిశాల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో నగరంలో 8.15 లక్షల నల్లా కనెక్షన్ లు ఉండగా, నేడు 13.17 లక్షల కు పెరిగాయని తెలిపారు.
నెలకు ఉచితంగా 20 వేల లీటర్ల నీటి సరఫరా
నెలకు ఉచితంగా 20 వేల లీటర్ల వరకు నీటి సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ. 815 కోట్లను ప్రభుత్వం భరిస్తుందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలకు ప్రతిరోజు 602 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మురుగునీటిని శుద్ధి చేసే అతిపెద్ద వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం సొంతం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, బెవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు దీపిక, కొలన్ లక్ష్మి, కుర్మ హేమలత, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.