హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు. జులై 16 వ తేదీన అంబర్ పేట లోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద నిర్వహించే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష(Review) నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను సీఎం కేసీఆర్(CM KCR) రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. బోనాలను వైభవంగా ఉద్దేశంతో వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం(Financial Assistance) అందించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందన్నారు. వచ్చే నెల 9 వ తేదీన సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న హైదరాబాద్ బోనాలు(Hyderabad Bonalu) జరుగుతాయని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలకు వారం ముందే జూలై 10,11 తేదీల్లో ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశముందని , ఎలాంటి ఆటంకాలు కలగకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తామన్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాలు జరిగేలా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం, ఆలయాల వద్ద బారికెడ్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
భక్తులు, వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మల్లించే విధంగా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఆలయాల పరిసరాలు ఎప్పటికప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని పారిశుధ్య సిబ్బందికి మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్లు పద్మ, విజయ్ కుమార్ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ వేణుగోపాల్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, అధికారులు పాల్గొన్నారు.