నేరేడ్మెట్, జూలై 14: రాచరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దారుల ఆరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న అని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఓల్డ్ అల్వాల్ ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర నేమూరి గణేష్ గౌడ్ జ్ఞాపకార్థం తన తనయుడు నేమూరి సాయిరాం గౌడ్, అల్వాల్ గౌడ సంఘ సభ్యుల సహకారంతో బహుజన వీరుడు సర్వాయి పాపన్న విగ్రహాన్ని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్, స్వామి గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్, కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్, సబితా అనిల్ కిషోర్తో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సామాన్య గీత కార్మిక కుటుంబంలో జన్మించి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి గోల్కొండ కోట పైన బహుజన జెండా ఎగురవేసి, బహుజన రాజ్యాన్ని స్థాపించిన అసమాన్య యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. దళిత, బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు, బహుజన వీరుడు సర్వాయి పాపన్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.