కొండాపూర్, మార్చి 9 : అనాధ, నిరుపేద మహిళలతోపాటు వృద్ధులకు అండగా నిలిచేందుకు మలబార్ చారిటబుల్ ట్రస్టు సామాజిక బాధ్యతతో చేయూతనివ్వడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క అన్నారు. శనివారం చందానగర్లో మలబార్ చారిటబుల్ ట్రస్టు, దయ రీహాబిలిటేషన్ ట్రస్టులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘గ్రాండ్మా హోమ్’, ‘హంగర్ ఫ్రీ వరల్డ్’ కార్యక్రమాలను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సమాజంలోని కుటుంబాల్లో అనేక మార్పులు వస్తున్నాయని, ఇంట్లోని పెద్దలను ఆశ్రమాలలో ఉంచుతూ, ప్రేమానురాగాలకు దూరం చేస్తున్నారన్నారు. ఎన్నో కష్టనష్టాలను ఓదార్చుకుని పెంచి పెద్ద చేసిన వారిని దూరంగా పెట్టడం సరైంది కాదన్నారు.
అనాధలు, అబాగ్యులు, నిరుపేద మహిళలకు ఆహారం, బట్టలు, వైద్యం అందించడంతోపాటు వృద్ధులకు వసతిని కల్పించేందుకు మలబార్ చారిటబుల్ ట్రస్టు, దయ రీహాబిలిటేషన్ ట్రస్టులు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్, వైస్ చైర్మన్ కేపీ అబ్దుల్ సలాం, ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అషర్ ఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిషాద్, రిటైల్ హెడ్ సిరాజ్, దయ రీహాబిలిటేషన్ ట్రస్ట్ ప్రాజెక్ట్ హెడ్ డాక్టర్ బాసిత్ వడక్కయిల్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.