ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 29: ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం మాజీ హెడ్ ప్రొఫెసర్ సూర్యాధనంజయ్(Suryadhananjay) రచించిన ‘కొంగు బంగారం’(Kongu Bangaram)పుస్తకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) ఆవిష్కరించారు. గిరిజన కుంభమేళాగా పిలువబడే సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర, ప్రాశస్త్యం, ఆదివాసీ గిరిజన సంప్రదాయాలపై పరిశోధనా దృష్టితో ఈ పుస్తకాన్ని ప్రొఫెసర్ సూర్యాధనంజయ్ రచించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సమ్మక్క సారలమ్మ చరిత్ర గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ గ్రంథం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రకృతి ఆరాధకులైన ఆదివాసీల సంస్కృతి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలైన సమ్మక్క, సారలమ్మల గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ అని అన్నారు. వారి చరిత్ర, సంప్రదాయాల గురించి రచించినైట్లెతే ఆదివాసీల చరిత్ర, సంప్రదాయాలను ప్రపంచానికి తెలిపినట్లేనని మంత్రి తెలిపారు.
రచయితను అభినందించారు. ఇలాంటి రచనలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జాతీయ ఉత్సవంగా గుర్తించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్ మాజీ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ ధనంజయ్నాయక్, డాక్టర్ రాజారాం తదితరులు పాల్గొన్నారు.