బంజారాహిల్స్, నవంబర్ 5: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటూ ఒత్తిళ్లు మరోవైపు.. బ్యాంకు నుంచి రుణం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఏఆర్ ఎస్ఐ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెక్యూరిటీ బాధ్యతలు చూసే ఏఆర్ ఎస్ఐ మహ్మద్ ఫజల్ అలీ(59) ఆదివారం శ్రీనగర్ కాలనీలోని మంత్రి నివాసం సమీపంలోని టీ స్టాల్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. హుస్సేనీ అలం ప్రాంతంలోని కోకాకీ తట్టీ బస్తీలో నివాసముంటున్న మహ్మద్ ఫజల్ అలీ రాచకొండ కమిషనరేట్లోని ఆర్మ్ రిజర్వ్ విభాగంలో ఏఆర్ ఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఏడాది కాలంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ బృందంలో విధులు నిర్వహిస్తున్నాడు.
ఆదివారం ఉదయం 6.30 సమయంలో తన కుమార్తె అసియా ఫాతిమా(24)తో కలిసి శ్రీనగర్ కాలనీకి వచ్చారు. మంత్రి నివాసానికి సమీపంలోని మణికంఠ హోటల్ వద్ద కుమార్తెను వేచి ఉండాలని సూచించాడు. డ్యూటీ వద్దకు వెళ్లి.. తన 9ఎంఎం సర్వీస్ రివాల్వర్ జేబులో పెట్టుకుని వచ్చాడు. కాసేపు కుమార్తెతో ఆర్థిక ఇబ్బందులు, రావాల్సిన లోన్ రాకపోవడం.. తదితర అంశాలపై చర్చించిన ఫజల్ అలీ.. కూతురు చూస్తుండగానే అకస్మాత్తుగా తన జేబులో నుంచి రివాల్వర్ తీసి కుడివైపు చెవి పైభాగంలో పాయింట్ బ్లాంక్లో పెట్టుకుని కాల్చుకొని.. అక్కడికక్కడే మృతి చెందాడు. క్షణాల్లో తన కళ్లముందే రివాల్వర్తో కాల్చుకుని తండ్రి మృతి చెందడంతో కుమార్తె అసియా ఫాతిమా షాక్కు గురైంది.
సంఘటనపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్, ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్, ఎస్ఐ చంద్రశేఖర్ తదితరులు అక్కడికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. మృతుడి చేతిలోని రివాల్వర్తో పాటు అతడి తలలోంచి బయటకు వచ్చిన బుల్లెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ అక్కడికి చేరుకుని దర్యాప్తును పర్యవేక్షించారు. ఫజల్ అలీ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని, మృతుడు కుమార్తె ఆసియా ఫాతిమాను ఓదార్చారు. ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల గురించి తనకు చెప్పి ఉంటే ఏదో రకంగా పరిష్కరించేవారిమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఫజల్ అలీ కుటుంబానికి అండగా నిలబడతామని భరోసా కల్పించారు.
కుటుంబ సమస్యలతో పాటు భరించలేని ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఏఆర్ ఎస్ఐ ఫజల్ అలీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. తన తండ్రి గత కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, అప్పులు తీర్చేందుకు బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తున్నా.. రుణం రాకపోవడంతో గత మూడు రోజులుగా ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదంటూ తన తండ్రి చెప్పాడని ఆసియా ఫాతిమా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫజల్ అలీకి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు, కొడుకు ఇమ్రాన్ ఉన్నాడు. వీరంతా హుస్సేనీ అలం ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు కుమార్తెలకు అప్పులు చేసి పెళ్లిళ్లు చేశాడు. అయితే, కుటుంబ కలహాల కారణంగా వారిద్దరూ విడాకులు తీసుకొని పుట్టింటిలోనే ఉంటున్నారు.
మూడో కుమార్తె ఆసియా ఫాతిమా కూడా పెళ్లీడుకు రావడంతో ఆమె పెళ్లి చేయాల్సి ఉంది. కొడుకు ఇమ్రాన్ సైతం చిన్నషాపు పెట్టుకుని జీవిస్తున్నా.. వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. గత ఐదారేళ్లుగా తనకు వచ్చే జీతం మొత్తం వడ్డీలకు, ఈఎంఐలకు సరిపోడంతో.. అద్దె చెల్లించడానికి కూడా ఇబ్బందులు పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో తీసుకున్న రుణాల భారం కూడా ఎక్కువ కావడంతో ఇటీవల హుస్సీనీ అలంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.10 లక్షల లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పదవీ విరమణ దగ్గరలో ఉండటంతో రుణం విషయాన్ని బ్యాంకు ఉద్యోగులు నానుస్తున్నారని తెలిపారు. ఇదే విషయంపై పలుమార్లు బ్యాంకు సిబ్బందితో వాగ్వాదం కూడా జరిగిందన్నారు. తనకు లోన్ రావడం కష్టమేనని, తనకు చావే శరణ్యమని నిర్ణయించుకున్న ఫజల్ అలీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.