మహేశ్వరం, అక్టోబర్ 9: ప్రణాళికాబద్ధంగా నియోజక వర్గం అభివృద్ధి పరుస్తున్నామని, తుక్కుగూడను మరో హైటెక్ సిటీగా మార్చబోతున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని తుక్కుగూడ, రావిరాలలో రూ. 8 కోట్లతో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ఆమె ప్రారంభించారు. అలాగే తుక్కుగూడలో రిజర్వాయర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలను ఇచ్చి మంచి నీళ్ల పండుగ చేసుకున్నామని గుర్తు చేశారు. మహేశ్వరం ప్రాంతంలో ఫ్యాబ్ సిటీ, ఫార్మాసిటీ, ఫాక్స్ కాన్ కంపెనీల రాకతో రానున్న కాలంలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగబోతున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషితో మెట్రోరైల్ను మహేశ్వరం వరకు తీసుకువస్తున్నామని తెలిపారు. తుక్కుగూడకు ప్రతీకగా నిలిచే బురుజును రూ.25 లక్షలతో అభివృద్ధి పరుస్తున్నామని, అదేవిధంగా బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తుక్కుగూడ మున్సిపాలిటీకి ఇప్పటి వరకు రూ.50 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషితో రూ.5 కోట్ల 50 లక్షలను మంజూరు కాగా సెంటర్లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహేశ్వరం పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ విడుదల చేసిన రూ.25 కోట్ల నిధులకు సంబంధించిన పనులకు ఇటీవల ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కాంటెకార్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీవెంకట్రెడ్డి, కమిషనర్ వెంకట్రామ్, కౌన్సిలర్లు బాధావత్ రవినాయక్, సప్పిడి లావణ్యరాజు ముదిరాజ్, బూడిద తేజస్విని శ్రీకాంత్గౌడ్, సుమన్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జల్లెల లక్ష్మయ్య, యూత్ అధ్యక్షుడు సామెల్ రాజు, మహిళా అధ్యక్షురాలు పద్మా భాస్కర్రెడ్డి నాయకులు పెంటమాల సురేశ్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే తుక్కుగూడ ప్రాంతానికి 50 కంపెనీలు వచ్చాయని, మరో 9 నెలల్లో ఫాక్స్కాన్ కంపెనీ నిర్మాణం పూర్తవుతుందని, తద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు రానున్నాయని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో రూ.40 కోట్లతో 10 చెరువులకు సుందరీకరణ, పూడిక తీత పనులు కొనసాగుతున్నాయని అన్నారు. రూ.6 కోట్ల 50 లక్షలతో రావిరాల పెద్ద చెరువును సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. రూ.15 కోట్లతో వివిధ కుల సంఘాల వారికి ఆత్మగౌరవ భవనాలను నిర్మిసున్నామన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సబ్బండ వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉంటున్నారని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని, రానున్న ఎన్నికల్లో మీ ఆడబిడ్డగా దీవించి ఆశీర్వదించాలని కోరారు.