పహాడీషరీఫ్, జూన్ 3 : జల్పల్లి చెరువు సందరీకరణ అభివృద్ధి పనులు, సృజనాత్మకత, కళారూపాలతో కూడిన రాతి ఉద్యానవనాన్ని నగరంలోనే మొదటిసారిగా రూ. 9 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జల్పల్లిలో చేపట్టనున్న ఉద్యానవన పనులపై గురువారం కార్యాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఇందుకు సంబంధించిన ఐదు ఎకరాల స్థలాన్ని వెంటనే హెచ్ఎండీఏ అధికారులకు అప్పగించాలని బాలాపూర్ మండల రెవెన్యూ అధికారులను ఫోన్లో ఆదేశించారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయిస్తున్నామని పేర్కొన్నారు. చూపరులను ఆకట్టుకునే విధంగా చెరువు చుట్టూ వివిధ జంతువులు, మనిషి ఆకారంలో ఉన్న కళా రూపాలను అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తెలిపారు. చెరువు చుట్టు లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎచ్ఎండీఏ కార్యనిర్వాహక ఇంజినీరు పద్మ, అసిస్టెంట్ ఇంజినీర్ శివకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.