తుక్కగూడ, మే 16: కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో జిల్లా పరిషత్ హైస్కూల్ను ఐసొలేషన్ సెంటర్గా మారుస్తూ కౌన్సిలర్ బూడిద తేజస్వినీశ్రీకాంత్ గౌడ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖాల్లో ఆదివారం జిల్లా పరిషత్ హై స్కూల్ను శానిటైజ్ చేసి ఐసొలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం తేజస్వినీశ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఇంట్లో ఒక్కరికి కరోనా వస్తే కుటుంబ సభ్యులందరికీ వచ్చే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న వారి కోసం ఒక్కొక్కరికి ఒక్కో గదిని కేటాయించి, వారికి వైద్యుల సూచన మేరకు మందులు, పౌష్టికాహారం అందజేస్తున్నామని తెలిపారు. హోం ఐసొలేషన్లో ఉన్న వారెవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని జడ్పీ హైస్కూల్ను ఐసొలేషన్ సెంటర్గా మార్చడంతో కౌన్సిలర్ బూడిద తేజస్వినీశ్రీకాంత్ గౌడ్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.