మహేశ్వరం, మే 15 : ప్రజల ప్రాణాలను కాపాడడానికే రాష్ట్రంలో లాక్డౌన్ విధించామని దానికి ప్రజలందరూ సహకరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డితో కలిసి కొవిడ్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రైవేట్ దవాఖానలో కరోనా పరీక్షలకు అనుమతి ఉన్నదిలేనిది తెలుసుకొని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలను పాటించే విధంగా గ్రామ సర్పంచ్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతు వేదికల వద్దనే రైతులు పండించిన కూరగాయలను అమ్ముకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొవిడ్ నిబంధనలపై అధికారులు ప్రతిరోజూ సమీక్షా సమావేశం నిర్వహించుకోవాలని సూచించారు. జ్వర సర్వేలో పాల్గొంటున్న అంగన్వాడీ టీచర్లు,ఆశ వర్కర్లకు మాస్కులు శానిటైజర్లను అందజేయాలని ఆమె అధికారులకు సూచించారు.
రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో కరోనా పరీక్షలను నిర్వహించాలన్నారు. గత నెల రోజుల నుంచి మండలంలో 3,478 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 493 మందికి కరోనా సోకినట్లు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు 8,749 మందికి డోసులు ఇచ్చామన్నారు. అనంతరం మండల కేంద్రంలో రూ. 4కోట్లతో నిర్మిస్తున్న దవాఖాన భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి,వైస్ఎంపీపీ సునీతా ,ఎంపీడీవో నర్సింహులు,తహసీల్దార్ జ్యోతి, డాక్టర్లు ఇంద్రాసేనారెడ్డి,సంధ్యారాణి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.