మణికొండ, సెప్టెంబర్ 26 : నగర శివారు పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ సమీపంలో శనివారం రాత్రి నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ కాలువలో పడి గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతున్నది. తెల్లవారుజాము వరకు భారీ వర్షంలోనూ రెస్యూ బృందాలు ఎంత వెతికినా.. ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్ తదితరులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. స్థానికులు, ప్రత్యక్షసాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గల్లంతైన వ్యక్తి గోపిశెట్టి రజనీకాంత్గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి సమీపంలోని బాబా నివాస్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేసిన అతడు కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. శనివారం రాత్రి నుంచి అతడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుడు ఒకరు తీసిన సెల్ఫోన్ వీడియో ఫుటేజీలోనూ రజనీకాంత్లా ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిన అధికారులు.. ఈ మేరకు బాధిత కుటుంబసభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్ షాద్నగర్లోని నోవా గ్రీన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి సిగరేట్ తాగేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి.. తిరిగి రాలేదని, సెల్ఫోన్ వీడియో ఆధారంగా అతడు రజనీకాంతేనంటూ కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గల్లంతైన వ్యక్తి రజనీకాంత్గా అనుమానిస్తుండటంతో ఆ కుటుంబాన్ని మంత్రి సబితాఇంద్రారెడ్డి ఓదార్చారు. నీటి కాలువలో అతనే పడ్డాడా లేదా అనే విషయంపై స్పష్టతలేదని, అయినా ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభు త్వం తరఫున బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఘటన చాలా బాధాకరమని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలకు ఆదేశిస్తామన్నారు.