బడంగ్పేట, డిసెంబర్ 1 : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రైవేటు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్ది నాణ్యమైన విద్యను అందజేస్తున్నామని చెప్పారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్నగర్లో మెగా సంస్థ సహకారంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల నూతన భవనానికి మంత్రి గురువారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెగా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్లలో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మించేందుకు ముందుకురాగా.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేయాలని కోరడంతో వారు మీర్పేట లెనిన్నగర్లో పాఠశాల నూతన భవనం నిర్మించేందుకు ముందుకువచ్చారని చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గంలో నాలుగు చోట్ల నూతన భవనాలను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా రూ.1.30 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే జూన్లో 1500 పాఠశాలలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సుసీందర్ రావు, మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ పీహెచ్ నాగేశ్వర్, ఎంఈఓ కృష్ణయ్య, కార్పొరేటర్లు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.