పహాడీషరీఫ్ : జల్పల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 3,4, 6, 15, 21,24 వార్డులో డ్రైనేజీ, సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు.
కొత్తగా కాలనీలు విస్తరిస్తున్న కొద్ది సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. పార్టీల కతీతంగా అందరం కలిసి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేద్దామన్నారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా డ్రైనేజీ ఔట్లెట్ సమస్య ఉందన్నారు. ఔట్లెట్ పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
ఇటీవలనే వార్డు 3లో ఉన్న కాలనీల ముంపు సమస్య పరిష్కారం కోసం రూ. 10 కోట్లు నిధులు కేటాయించి పనులను ప్రారంభించుకున్నామన్నారు. రూ. 1.70 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. మంచి నీటి సమస్య కోసం కోట్లాది రూపాయలతో నూతనంగా రిజార్వయ్యర్లు నిర్మించి మంచి నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మన్ పర్హనా నాజ్, కమిషనర్ జి.పి కుమార్, కో -ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు అహ్మద్ కసాడి, షేక్ పహిమిదా అప్జల్, జింకల రాధిక శ్రవణ్, జాఫర్బామ్, ఖాలెద్ బిన్ అబ్దుల్లా, షేక్ అలీం, నాయకులు ఇక్భాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, యంజాల జనార్థన్, షేక్ అప్జల్, యాస్మిన్ బేగం, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.