కందుకూరు, ఏప్రిల్ 20: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదంలో కాలు కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న వ్యక్తి కృత్రిమ కాలు అమర్చుకోడానికి సహకరించారు. దీంతో బాధితుడు బుధవారం మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సంతోషం వ్యక్తం చేశారు. సాయిరెడ్డిగూడ గ్రామానికి చెందిన జశ్వంత్గౌడ్ తండ్రి మల్లేశ్గౌడ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిశాడు.
ప్రమాదంలో తన కుమారుడు కాలు కోల్పోయాడని చెప్పి, సాయం కోరాడు. తక్షణమే స్పందించిన మంత్రి.. కృత్రిమ కాలు అమర్చడానికి రూ. 3.10 లక్షలు మంజూరు చేయించారు. మంత్రి మంజూరు చేసిన డబ్బుతో కృత్రిమ కాలును అమర్చుకొని బాధితుడు, కుటుంబసభ్యులు బుధవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటున్నదని మల్లేశ్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. మంత్రిని కలిసి వారిలో దాసర్లపల్లి మాజీ సర్పంచ్ తాండ్ర దేవేందర్, గోవర్ధన్, పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఉచిత శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఈనెల 20న తుక్కుగూడలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలపారు. రాష్ట్ర ప్రభుత్వం 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇంద్రారెడ్డి ట్రస్టీ ఆధ్వర్యంలో తానే స్వయంగా ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 26న కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. శిక్షణకు కావాల్సిన ఫారాలు సీఐ వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకుల వద్ద అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని గ్రామ గ్రామాన సర్పంచ్లు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలియజేయాలని కోరారు. యువకులు పట్టుదలతో ఉద్యోగం సాదించాలని కోరారు.ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.
సీఎం సహాయనిధి పేదలకు ఆసరా..
మహేశ్వరం, ఏప్రిల్ 20: సీఎం సహాయనిధి నిరుపేదలకు ఆసరా లాంటిదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెండ్యాల గ్రామానికి చెందిన యాచారం దశరథకు మంజూరైన రూ.60వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్, సహకార బ్యాంక్ వైస్చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆంగోత్ రాజూనాయక్, గ్రామ సర్పంచ్ మంత్రి సంధ్యారాజేశ్, ఉపసర్పంచ్ ఎండీ గౌస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.