సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో అర్హులైన వారందరికీ త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాపై సమీక్షా సమావేశం నిర్వహించింది. జిల్లా అభివృద్ధి, సంక్షేమంతో పాటు పెండింగ్ పనుల పురోగతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, డీఆర్ఓ వెంకటాచారితో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాఖల వారీగా ఉన్న సమస్యలు, పురోగతి, అభివృద్ధి గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఏడు ప్రాంతాలలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని త్వరలోనే అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని మంత్రి అన్నారు.
ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నామని, ఈ నిధులను అభివృద్ధి పనుల కోసం ఖర్చుచేయాలని సూచించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తామని, అందుకు సంబంధించి త్వరలోనే భూ సేకరణ చేపడుతామని తెలిపారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో ఫిష్ మార్కెట్లు నిర్మించే ఆలోచన ఉన్నదని, అవసరమైతే ప్రతి మండలంలో ఒక ఫిష్ మార్కెట్ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, బస్తీ దవాఖానలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు పెరిగిన డైట్ చార్జీలు అమలు చేస్తామని చెప్పారు. జీవో 58, 59 సంబంధించిన అంశాలను కూడా సమీక్షిస్తామని అన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు పరుస్తామని, దోబీఘాట్ల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ క్రమంలో జిల్లా రెవెన్యూ విభాగంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, శిశు సంక్షేమ శాఖ, వయోజన విద్య, చేనేత, ఉపాధి కల్పన శాఖ వంటి అంశాలపైనా మంత్రి చర్చించారు.