కీసర, మే 17 : ప్రతి మండలానికి డిజిటల్ స్థాయిలో అత్యాధునిక గ్రంథాలయాల భవనాలను నిర్మిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలోని రామలింగేశ్వరకాలనీలో బుధవారం రూ.1కోటితో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి, చీర్యాల్ గ్రామంలోని గ్రీన్ఫీల్డ్ కాలనీలో రూ.10లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమన్నారు. కేంద్ర, రాష్ట్ర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగుల కోసం గ్రంథాలయాల్లో విలువైన పుస్తకాలను ఉంచుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్రెడ్డి, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జలాల్పురం సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.