పీర్జాదిగూడ/ఘట్కేసర్/కీసర, నవంబర్ 8: నియోజకవర్గ వ్యాప్తంగా కార్తిక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళవారం చంద్రగ్రహణం ఉండడంతో భక్తులు తెల్లవారుజామునే స్నానాలు చేసి ఆలయాలకు వెళ్లి స్వామివార్లకు ప్రత్యే పూజలు చేసి కార్తిక దీపాలను వెలిగించారు.జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ భవానీరామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలను ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే గర్భాలయంలో స్వామివారికి వేదపండితుల మంత్రోచ్ఛరణల స్వామివారికి తేనె, ఆవుపాలు, పంచామృతంతో మహాన్యాస రుద్రాభిషేకాన్ని నిర్వహించారు.
మంత్రి చామకూర మల్లారెడ్డి,మంత్రి తనయుడు భద్రారెడ్డితో కలిసి ఉదయమే ఆలయానికి చేరకొని స్వామివారి అభిషేకం నిర్వహించారు. అంతకు ముందు ఆల య చైర్మన్ ఉమాపతిశర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి సుధాకర్రెడ్డి, వేదపండితులు కలిసి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు మంత్రిని ఘనంగా శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇందిరలక్ష్మీనారాయణ, సర్పంచ్ మాధురి వెంకటేశ్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, మండల అధ్యక్షులు సుధాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, టీఆర్ఎస్ నేతలు నాయకపు పాల్గొన్నారు.
మండల పరిధి రాంపల్లిదాయరకు చెందిన వార్డు సభ్యులు రాజిరెడ్డి స్వచ్ఛందంగా కీసరగుట్ట ఆలయానికి 12 ఎల్ఈడీ లైట్లను మంగళవారం మంత్రి చేతుల మీదుగా బహూకరించారు. అదేవిధంగా కీసర శ్రీ ప్రసన్నంజనేయస్వామి ఆలయంలో భక్తులు కార్తికమాసోత్సవంలో భాగంగా కార్తికదీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, శ్రీ వీరాంజనేయస్వామి, శ్రీ విగ్నేశ్వర ఆలయాల్లో మూల మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.