జవహర్నగర్, జూలై 31: ఉపాధి కల్పనలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని, స్వరాష్ట్రంలో మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారని, పాలన దక్షతలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడంతోనే, ప్రతి రంగంలో మహిళలు దూసుకెళ్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) వారి ఆధ్వర్యంలో 160 మంది మహిళలకు సోమవారం కట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరై మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, దేశంలోని ఇతర రాష్ర్టాల ప్రజలు ఉపాధి కోసం తెలంగాణకే వలస వస్తున్నారని, మహిళలు స్వయం కృషితో ముందుకు వెళ్ళాలని కోరారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవని, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ను ఏర్పాటు చేశారని, అమ్మాయిల చదువు కోసం ప్రత్యేకంగా గురుకులాలు నెలకొల్పిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతున్నదని తెలిపారు. మహిళలు కుట్టు మిషన్లో ప్రత్యేకతను కనబర్చి, ఇతరులకు ఉపాధిని కల్పించి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. అనంతరం, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామలింగం, కార్పొరేటర్లు ఏకే మురుగేష్, లలితా యాదవ్, జిట్టా శ్రీవాణి శ్రీనివాస్రెడ్డి, నిహారిక గౌడ్, మెట్టు ఆశా కుమారి, లావణ్య సతీష్ గౌడ్, శ్రీనివాస్రెడ్డి, వేణు, శారదా మనోధర్రెడ్డి, పల్లపు రవి, వేణు, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, న్యాక్ అధికారులు, నాయకులు సాధిక్, ప్రకాష్, నవీన్ యాదవ్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.