కీసర/ ఘట్కేసర్/ పీర్జాదిగూడ, ఆగస్టు 30: తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దమ్ముంటే.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలని ఆ పార్టీకి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని కీసర, ఘట్కేసర్, పీర్జాదిగూడలో ఆసరా పింఛన్ కార్డులను మంత్రి లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తున్నదని, పాల నుంచి మొదలుకొని అంత్యక్రియల వరకు జీఎస్టీ విధిస్తూ ప్రజలపై భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. భవిష్యత్తులో సీఎం కేసీఆర్ దేశానికి చుక్కానిలా మారి, స్థితిగతులను మారుస్తారని, మనమంతా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్ పెద్దన్న లాగా లక్షలాది మందికి పింఛన్ల ద్వారా ఆసరా కల్పిస్తున్నారని, దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా బతుకుతున్నారని చెప్పారు. 57 ఏండ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తున్న ఘనత కూడా సీఎం కేసీఆర్కే దక్కుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి, పోచారం మున్సిపల్ ఛైర్మన్ కొండల్రెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క..
పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్న కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకు లెక్క. వయసు పైబడిన వాళ్లకు నెలకు రూ.2000 ఇచ్చి ఆదుకుంటున్న ఆయనను దేవుడు సల్లంగా చూడాలి. ఇప్పటి వరకు ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదు.
– హాజీ బీ, డబిల్పూర్
కేసీఆర్ తప్పఎవరూ ఆదుకోలేదు
సీఎం కేసీఆర్ లెక్క వికలాంగులను ఎవరూ ఆదుకోలేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పోయినయి. కానీ ఇంత పింఛన్ ఇవ్వలేదు. ప్రజలను సల్లంగా చూడటంలో ఆయనకు ఎవరూ సాటిలేరు. ఎప్పటికీ ఆయనే సీఎంగా ఉండాలి.
– యాదగిరి, మేడిపల్లి
పింఛను వస్తుంది..ఇక బాధలు ఉండవు
భర్త లేని వితంతువులకు సీఎం ఇచ్చే పింఛన్ నాకు మంజూరు కావడం సంతోషంగా ఉంది. చేతి ఖర్చులకు కుటుంబ సభ్యులపై ఆధార పడాల్సి వస్తున్నది. ఇంగ ఈ పింఛను వస్తుంది కద, నాకు బాధలుండవు. కేసీఆర్ సార్కు చేతులెత్తి మొక్కాలి.
– సిద్ధమ్మ, అన్నానగర్, పోచారం మున్సిపాలిటీ