బోడుప్పల్, అక్టోబర్ 21 : దశాబ్దాల పాటు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. కలహాలు, కుట్రలు, కుతంత్రాలకు కాంగ్రెస్ పుట్టిల్లుగా నిలిచిందని ఎద్దేవా చేశారు. శనివారం బోడుప్పల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని స్థానిక పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోడుప్పల్ ప్రధాన కూడలి అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. స్కాంల కాంగ్రెస్ను ప్రజలు కాలగర్భంలో కలిసే సమయం ఆసన్నమైందని, ఓటుతోనే ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. కేసీఆర్ హామీఇస్తే కచ్చితంగా వందశాతం అమలు చేస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఐదేండ్లలో చేసిన అభివృద్ధి, వచ్చిన సర్వే రిపోర్టు ఆధారంగా బీఆర్ఎస్లో టికెట్లు లభిస్తే… కాంగ్రెస్ పార్టీలో అర్రాస్ పాటలో టికెట్లు అమ్ముకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నామని, మరి కాంగ్రెస్ హయాంలో చేసిన స్కాంలను చూపించి ఓట్లు అడుగుతారా ? అని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, బోడుప్పల్ను ప్రగతిపథంలో నడిపిన సర్కారును మరోసారి ఆశీర్వదించాలని కోరారు. బోడుప్పల్లో ఉన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భవిష్యత్తులో అర్హులైన పేద కుటుంబాలకు రూ.4వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. దశలవారీగా ఆసరా ఫించన్లను రూ.5016కు పెంచుతామని, స్వశక్తి మహిళా గ్రూపులకు భవనాలను నిర్మిస్తామని, అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకులాలను ఏర్పాటు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చినట్లు తెలిపారు. సబ్బండ వర్గాల అభ్యున్నతి, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు.