జవహర్నగర్, ఆగస్టు 9 : బాధిత యువతిని సొంత బిడ్డలాగా చూసుకుంటా.. ఆమెను అన్ని విధాలుగా ఆదుకొని అండగా ఉంటాను.. కార్పొరేషన్లో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చేలా చూస్తానని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న యువతి ఘటన తనను ఎంతగానో కలిచి వేసిందన్నారు. మంత్రి మల్లారెడ్డి బుధవారం మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్తో కలిసి బాధిత మహిళ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు రక్షణగా ఎన్నో చట్టాలను తీసుకు వచ్చిందన్నారు. ఉన్మాదిని సహించేది లేదని, కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. షీ టీమ్స్తో ఆకతాయిల ఆటలను కట్టడి చేస్తున్నామని చెప్పారు. బాధిత మహిళ పట్ల సొంతంగా కేర్ తీసుకుంటానని, ఆమె చదువుకు అనుగుణంగా ఉద్యోగం వచ్చేలా చేస్తానని చెప్పారు. నీవు అధైర్యపడకు.. నీకు నేను ఉన్నాను.. అని భరోసా కల్పించి ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో కార్పొరేటర్లు జిట్టా శ్రీవాణి, శారదా మనోధర్రెడ్డి, సంగీతా రాజశేఖర్, నిహారిక గౌడ్, లావణ్య సతీష్గౌడ్, రాంచందర్, రాజ్కుమార్, ప్రేమల శ్రీనివాస్, సాయి, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, పార్టీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, మహిళలు తదితరులు ఉన్నారు.