పజా సమస్యల సత్వర పరిష్కారానికి అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. నగర పౌరులకు పరిపాలన మరింత చేరువ చేసేలా వార్డు పాలన నేటి నుంచి మొదలు కానున్నది. వార్డుకు 10 మంది చొప్పున 150 వార్డుల్లో 1500 మంది అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి.. ప్రజా సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపనున్నారు. సమస్యలు ఎంత సమయంలో పరిష్కారం చేయాలనే నిర్ణీత గడువు సూచించే..సిటిజన్ చార్టర్ను ఏర్పాటు చేశారు. శుక్రవారం కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే అమీర్పేట బీకే గూడ వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మోండామార్కెట్ రెజిమెంటల్ బజార్, కవాడిగూడ సర్కిల్ తల్లాబస్తీ, గోషామహల్ బేగంబజార్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బంజారాహిల్స్ సీఎంటీఈఎస్, హిమాయత్నగర్ మేల్కోటి పార్క్, ఎల్బీనగర్, లింగోజిగూడ, రామంతాపూర్ వివేకానగర్లో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తారు.
Minister KTR | సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ ): నగరంలో శుక్రవారం నుంచి వార్డు పరిపాలన అందుబాటులోకి రానున్నది. ఉదయం 8:30 గంటలకు వార్డు కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. జీహెచ్ఎంసీ పాలన స్వరూపాన్ని మరోసారి మార్చుకోనున్నది. పౌర సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు పాలన వికేంద్రీకరణలో భాగంగా నగరంలో వార్డు సెంట్రిక్గా పాలన చెయ్యాలనే కొత్త ఆలోచనలు చేసింది. ప్రభుత్వం వార్డు అధికారితో పాటు మొత్తం వార్డులో 10మంది చొప్పున 150 వార్డులలో 1500 మంది అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ప్రజా సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపనున్నారు. సమస్యలు ఎంత సమయంలో పరిష్కారం చెయ్యాలనే సిటిజన్ చార్టర్ను అక్కడ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మోండామార్కెట్ రెజిమెంటల్ బజార్, కవాడిగూడ సర్కిల్ తల్లాబస్తీ, గోషామహల్ బేగంబజార్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, బంజారాహిల్స్ సీఎంటీఈఎస్, హిమాయత్నగర్ మెల్కోటి పార్క్, ఎల్బీనగర్, లింగోజిగూడ, రామంతాపూర్ వివేక్నగర్లో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అమీర్పేట బీకేగూడ వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వార్డు కార్యాలయాలను ప్రారంభించనున్నారు.
ఇలా.. వార్డు పాలన వార్డు పరిపాలనాధికారి
వార్డు పాలనకు సంబంధించిన అన్ని అంశాలకు వీరే బాధ్యులు. వివిధ విభాగాల అధికారులకు సహకారం అందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక విధుల్లో నియమించాలి. ఫిర్యాదులు సత్వర పరిష్కారం అయ్యేలా చూడాలి. పరిష్కారాలను (ఏటీఆర్) నమోదు చేసేలా చూడాలి.
వార్డు ఇంజినీర్
గుంతలు, ఫుట్పాత్లు, క్యాచ్పిట్లపై మూతల సమస్యలు లేకుండా చూడాలి. వీధి దీపాల సమస్యలను సంబంధిత అధికారికి పంపించాలి.
వార్డు టౌన్ప్లానర్
వార్డులో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు జరుగకుండా చూడాలి. వీటిపై అందే ఫిర్యాదులపై తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు ఆన్లైన్ ద్వారా నివేదికలు పంపాలి. అధికారులు అప్పగించే పనులు చేయాలి.
వార్డు ఎంటమాలజిస్ట్
దోమల నివారణ బృందాలు సక్రమంగా పనిచేసేలా చూడాలి. దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
కమ్యూనిటీ ఆర్గనైజర్
పేద కుటుంబాల్లోని మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులయ్యేలా చూడాలి. వారికి బ్యాంకుల నుంచి రుణాలు, ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందేలా చూడాలి. సీనియర్ సిటిజన్లకు ఐడీ కార్డులందజేయాలి. వారికి డే -కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.
శానిటరీ జవాన్
పారిశుద్ధ్య కార్మికులు సమయానికి విధులకు హాజరయ్యేలా, పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూడాలి. ఇంటింటి నుంచి చెత్త సేకరణ 100శాతం అమలుచేయాలి. వార్డులో బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా చెత్త , డెబ్రిస్ లేకుండా చేయాలి. వివిధ మాధ్యమాల ద్వారా అందే ఫిర్యాదులను పరిష్కరించాలి.
యూబీడీ సూపర్ వైజర్
ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై చెట్ల కొమ్మలు నరికి వేయాలి. పార్కులు, ఇతరత్రా ప్రాంతాల్లో పచ్చదనం కార్యక్రమాలు తనిఖీలు చేయాలి. ప్రజల భాగస్వామ్యంతో వార్డుల్లో పచ్చదనం పెంచాలి.