సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో శిల్పారామం ఏర్పాటు కోసం హెచ్ఎండీఏ ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించింది. ఇందులో ఇప్పటికే పలు కార్యకలాపాలు కొనసాగుతుండగా, సమావేశాల కోసం ప్రత్యేకంగా శిల్పారామం కన్వెన్షన్ హాలు నిర్మాణం చేపట్టారు. శిల్పారామం నిర్వహణను శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చర్ సొసైటీ హైదరాబాద్ నిర్వహిస్తోంది. నూతనంగా నిర్మించిన శిల్పారామం కన్వెన్షన్ హాలు నిర్మాణం కోసం హెచ్ఎండీఏ రూ.10 కోట్లను కేటాయించింది. ఒకేసారి వెయ్యి మంది కూర్చునేలా అత్యాధునిక మౌలిక వసతులతో హాలు నిర్మాణాన్ని పూర్తి చేశారు. అలాగే వంటశాలను విశాలమైన స్థలంలో ఏర్పాటు చేసి, ఇతర మౌలిక వసతులు కల్పించారు.ఈ కన్వెన్షన్ హాలును రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు.