జంటనగరాల వారధి ట్యాంక్బండ్ అందాలను నడుస్తూ హాయిగా వీక్షించేందుకు సమయం ఆసన్నమైంది. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్యాంక్బండ్పై వాహనాలను అస్సలు అనుమతించరు. కేవలం పర్యాటకులు నడిచి వెళ్లేందుకు అనుమతిస్తారు. ఆ సమయంలో వాహనాలను ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తారు. ఈనెల 29వ తేదీ నుంచి ప్రతి ఆదివారం 3 గంటలపాటు ట్యాంక్బండ్పై పాదచారులకే అనుమతిస్తామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. సరికొత్త నిర్ణ యం వల్ల పర్యాటకులకు వాహనాల గజిబిజి తప్పనుంది. సుమారు రూ.27 కోట్లతో ట్యాంక్బండ్ సుందరీకరణ పనులు గతేడాది ప్రారంభం కాగా, ఇప్పటికే 90 శాతం మేర పూర్తయ్యాయి.
సిటీబ్యూరో, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): మహా నగరవాసులు ఆదివారం సాయంత్రం వేళల్లో హాయిగా తిరిగేందుకు, ఇక నుంచి ట్యాంక్బండ్ ప్రాంతాన్ని కుటుంబ సమేతంగా రణగొణ ధ్వనులు లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో తనివి తీరా చూసేందుకు నగర పోలీసులు ట్రాఫిక్ ఫ్రీగా అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ట్యాంక్బండ్ పరిసరాలను అందంగా తీర్చిదిద్దడంతో పాటు నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా ప్రభుత్వం అక్కడ సుందరీకరణ పనులను ఇప్పటివరకే 90 శాతం పూర్తి చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో ఒక సామాన్య పౌరుడు ట్యాంక్బండ్ అందాలను వీక్షించే విధంగా, ఆదివారం సాయంత్రం వేళల్లో కొద్ది సేపు ట్రాఫిక్ను నిలిపివేయాలని కోరాడు. పౌరుడు ఇచ్చిన సలహా బాగుందని, దీనిని అమలు చేస్తే బాగుంటందని కేటీఆర్ సైతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్కు ట్విట్టర్ ద్వారా సూచించారు. ఇందులో భాగంగానే వచ్చే ఆదివారం నుంచి ట్యాంక్బండ్పై సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ, నగర వాసులు ట్యాంక్బండ్పై కాలినడకతో అంతా పర్యటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
వీకెండ్స్లో కుటుంబ సమేతంగా ప్రతి నగరవాసి ఒక ఆహ్లాదకరమైన ప్రదేశానికి, లేదా పార్కులకు వెళ్లాలనుకుంటారు. అలాంటి ప్రదేశాలు ప్రపంచంలో ప్రధాన నగరాలలో ఎన్నో ఉన్నాయి. వాటిలో మచ్చుకు.. న్యూ యార్క్ నగరానికి ‘లిబర్టీ ఐల్యాండ్’… లండన్ నగరానికి ‘ట్రాఫాల్గర్ స్కేర్’… మాదిరిగా హైదరాబాద్ నగరానికి ట్యాంక్బండ్ ఒక మణిహారం. అలాంటి ట్యాంక్ బండ్ను అత్యాధునిక హంగులతో, వారసత్వ శోభలను సంతరించుకొని అటు నగరవాసులను, ఇటు పర్యాటకులను ఆహ్లాదపరిచ్చేందుకు సిద్ధమైంది.
దీంతో ట్యాంక్బండ్పై వాహనాలను అనుమతించకుండా పూర్తిగా సందర్శకులు మాత్రమే తిరుగుతూ అక్కడి అందాలను పూర్తి స్థాయిలో ఆదివారం సాయంత్రం వేళల్లో నగరవాసులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ సుందరీకరణ పనుల్లో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సుమారు రూ.27 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. ఇప్పటికే 90 శాతం సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. సుందరీకరణలో భాగంగా ఇరువైపులా ఫుట్పాత్లను పూర్తిగా తొలగించి, ఆధునీకరించారు. ఎంతో విశాలంగా ఉన్న ట్యాంక్ బండ్పై గ్రానైట్ రాళ్లతో ఫుట్పాత్లను తీర్చిదిద్దారు.
పీవీసీ పైపులను, వరద నీటి పైపు లైను వ్యవస్థను భూగర్భంలోంచి వేశారు. ట్యాంక్ బండ్ ప్రాంతం గట్టిగా ఉండేందుకు క్రషర్ సాండ్తో పీసీసీ, స్లాబ్ రీఇన్ఫోర్స్మెంట్ చేశారు. 25-30 మందంతో గ్రానైట్ రాళ్లను ప్లేమ్ ఫినిష్డ్ ఉపరితలంలో వేశారు. కాగా, ప్రతియేటా గణేశ్ ఉత్సవాల సమయంలో విగ్రహాల నిమజ్జనం చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసే క్రేన్ల కోసం ప్రత్యేకంగా స్థలాన్ని సిద్ధం చేశారు. గతేడాది అక్టోబర్లో ప్రారంభమైన ఫుట్పాత్ ఆధునీకరణ పనులకు మొత్తం రూ.14.50 కోట్లను ఖర్చు చేయగా, రూ.12.50 కోట్లతో హేరిటైజ్ శైలిలో విద్యుత్ దీపాలంకరణను చేపట్టారు. హైదరాబాద్ నగరం అంటేనే ఎంతో పురాతన, వారసత్వ సంపదకు నిలయం. అలాంటి నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ కట్టపై అలనాటి వారసత్వాన్ని కళ్ల ముందుంచి సరికొత్త తరహాలో విద్యుద్దీపాలంకరణను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.
సీఐ (క్యాస్ ఐరన్) రెయిలింగ్, హెరిటేజ్ ఆర్నమెంటల్ డెకరేటివ్ సోల్స్, ఆధునిక శైలిలో రూపొందించిన బస్టాప్లను, రెయిన్ షెల్టర్లను, కూర్చునేందుకు సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. అలంకరణతో కూడిన వీధి దీపాల స్తంభాలను ప్రతి 15 మీటర్లకు ఒకటి ఎడమ వైపు, ప్రతి 30 మీటర్లకు ఒకటి చొప్పున కుడివైపున ఏర్పాట్లు చేశారు. వర్షాకాలంలో వర్షపు నీరు ట్యాంక్ బండ్ రోడ్డుపై నిల్వకుండా ఉండేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. హుస్సేన్సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండాను ట్యాంక్బండ్పై నుంచి చూసేందుకు ఇక్కడి నుంచి అవకాశముంది. హుస్సేన్సాగర్లో బోటింగ్ విన్యాసాలు, బోటింగ్లో తిరిగే వారిని వీక్షించడంతో పాటు ఎంతో ప్రతిష్టాత్మకమైన హుస్సేన్సాగర్ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని నగరవాసులు వీక్షిస్తూ ఆహ్లాదకరమైన వాతావారణాన్ని అస్వాదించేలా ఏర్పాట్లు ఉన్నాయి.
ట్యాంక్ బండ్పై ఆదివారం సాయంత్రం వేళల్లో నగర వాసులు హాయిగా, కుటుంబ సమేతంగా సమయం వెచ్చిస్తూ గడిపేందుకు వీలుగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తాం. నగరవాసులు ఎక్కువగా కుటుంబ సమేతంగా బయటకు వస్తుండటంతో ఆ సమయంలో వారికి ట్యాంక్బండ్ను ట్రాఫిక్ ఫ్రీగా మారుస్తాం. ఇందులో భాగంగా ట్రాఫిక్ మళ్లింపు, ట్యాంక్బండ్కు వచ్చే వారి వాహనాలకు సంబంధించిన పార్కింగ్ స్థలాల కేటాయింపు తదితర అంశాలపై పరిశీలన చేస్తున్నాం. – అంజనీ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్