సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఎన్నికలకు మరో 19 రోజుల సమయం మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలో విమర్శనాస్ర్తాలను సంధిస్తున్నారు. గల్లీలు, కాలనీల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు హోరాహోరీ ప్రచారం చేపడుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రచారంలో హోరెత్తించేలా అభ్యర్థులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలతో బహిరంగ సభలు, రోడ్ షోలు, అంతర్గత సమావేశాలతో పాటు స్టార్ క్యాంపెయినర్లను ప్రచార పర్వంలోకి దించి ఓట్లను కొల్లగొట్టేందుకు అభ్యర్థులు ఎవరికీ వారే తనదైన శైలిలో ప్రచారంలో రాణిస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. గడిచిన రెండు నెలలకు పైగా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనతో హోరెత్తిస్తున్నారు. క్యాడర్లో మరింత జోష్ పెంచేలా ఆత్మీయ సమావేశాలను అభ్యర్థులు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు నియోజకవర్గాల్లో జరిగిన బూత్ కమిటీ కార్యకర్తల సమావేశాలు, ఆత్మీయ సమావేశాల్లో పాల్గొని పోలింగ్ సమయంలో వ్యవహరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల భారీ మెజార్టీ గెలుపునకు అనుసరించాల్సిన విధానాలపై శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15 నుంచి 22న నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు చేపట్టనున్నారు. అగ్ర ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 25న సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు.
అభివృద్ధి ఆగొద్దంటే..బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని..తొమ్మిదిన్నరేళ్లలో చేసిన హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఓటేయాలని అభ్యర్థులు ఓటర్లను కోరుతున్నారు. పదేండ్ల అభివృద్ధి, ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రచార అస్త్రంగా కాలనీలు, బస్తీలు కలియ తిరుగుతూ ప్రజల మద్దతును కూడగడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని 65 ఏండ్లు పాలించిన అభివృద్ధి జరగలేదని, గడిచిన పదేండ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వందేండ్ల అభివృద్ధికి బాటలు వేసిందంటూ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్న బీఆర్ఎస్.. ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు. కలిసి వచ్చే ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువాలు కప్పుతూ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ముఖ్యంగా గెలుపోటములు నిర్ధారించే పోలింగ్ బూత్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న అభ్యర్థులు సామాజిక వర్గాల వారీగా ఓటర్లను గుర్తించడం, ప్రతి వంద ఓటర్లకు ఇన్చార్జిల చొప్పున పనిచేస్తూ భారీ మెజార్టీతో అభ్యర్థులు గెలిచే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నది.