‘ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదని ప్రతిపక్షాలు బద్నాం చేస్తున్నయి. ఎన్ని కొలువులిచ్చినమో మొన్ననే లెక్కలతో సహా చూపించినం. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో పదివేల ఉద్యోగాలిస్తే..ఆరేండ్లలో స్వరాష్ట్రంలో లక్షా 32 వేలు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చినం. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే బరాబర్గా 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తాం. పట్టభద్ర ఓటర్లు జర ఆలోచన చేయండి. ఆగం కాకండి. వివేకంతో ఓటెయ్యండి. మీ (పట్టభద్రులు) ఓటుతో ప్రతిపక్షాల దిమ్మ తిరగాలె. అనాలోచితంగా, అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్, బీజేపోళ్లను గట్టిగా నిలదీయాలి. టీఆర్ఎస్ వచ్చినంక కరెంటు కోతల్లేవ్.. నీళ్ల బాధలు పోయినయి. మంచి పోలీసింగ్ ఉండడం వల్లే అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నయి. పనిచేస్తున్న ప్రభుత్వానికి, అభివృద్ధిని కాంక్షించే వారంతా వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటేయాలి. పోలింగ్ రోజు హాలిడే అని కాకుండా ఓటు హక్కు వినియోగించుకొని పోలింగ్ శాతం పెంచుదాం’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం జలవిహార్లో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. మాసబ్ట్యాంక్, రాజేంద్రనగర్, పద్మారావునగర్లలో మంత్రులు గంగుల, తలసాని ప్రచారం నిర్వహించారు..
బన్సీలాల్పేట్/ రవీంద్రభారతి/ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ ): సుస్థిరమైన పాలనతోనే అభివృద్ధి సాధ్యమని, అందుకే అభివృద్ధి చేసిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్యాదవ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సనత్నగర్లోని పద్మారావునగర్లో పట్టభద్రులు, మాసాబ్ట్యాంక్లో జేఎన్టీయూలో ఆల్ యూనివర్శిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తప్పడు మాటలు చెబుతూ, అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్న బీజేపీని నమ్మవద్దని ఓటర్లను గంగుల కోరారు. తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను తుంగలో తొక్కిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే లేని పథకాల్ని తెలంగాణలో అమలు చేస్తూ దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. ఈ అభివృద్ధ్దికి ఊతమివ్వాల్సింది పోయి మొన్న ఐటీఐఆర్ , నిన్న కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ, నేడు జీఎస్టీ పరిహారం వరకు కేంద్రం వివక్ష చూపుతుందని పేర్కొన్నారు. సంక్షోభంలోనూ అవకాశాలు సృష్టించగల మేథస్సు తెలంగాణ సొంతమని, అందుకు నిదర్శనం మన ముద్దు బిడ్డలు మాజీ ప్రధాని పీవీ, సీఎం కేసీఆర్లే అన్నారు. తెలంగాణలో ఆరేండ్ల క్రితానికి ఇప్పటికీ ఎలాంటి మార్పు వచ్చిందో పట్టభద్రుల్ని గమనించాలని గంగుల కోరారు. లక్షా 33వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు లక్షలాది ప్రైవేట్ ఉద్యోగాలను కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. ఈ అభివృద్ధి కొనసాగించడానికి వాణీదేవి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సీఎం కేసీఆర్కు మద్దతు తెలపాలని గంగుల కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని మంత్రి తలసాని కోరారు. విద్యాధికులు ఓటు వేయరనే అపవాదును తొలగించాలని, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని, మొదటి ప్రాధాన్యత ఓటును ఎస్. వాణీదేవికి వేసి గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మొదలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు జరిగిన అభివృద్ధిని చూడాలని సూచించారు. ప్రపంచ స్థాయి కంపెనీలు గూగుల్, ఆమెజాన్, ఫేస్బుక్ లాంటి సంస్థలు దేశంలో కేవలం హైదరాబాద్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఈ ప్రగతి సీఎం కేసీఆర్ అందిస్తున్న సుస్థిర పాలన, శాంతిభద్రతల పరిరక్షణే కారణమన్నారు.