మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ పరిధిలో ఓఆర్ఆర్ ఫేజ్ -2 డ్రింకింగ్ వాటర్ పనులకు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. జవహర్ నగర్ పరిధిలోని చెన్నాపురం చెరువు సుందరీకరణ పనులతో పాటు రోడ్డు విస్తరణ పనులను మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 2 లక్షల ఇండ్లకు తాగునీటి సరఫరా కల్పిస్తామన్నారు. రూ. 1200 కోట్లతో జలమండలి ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్-2 పనులు చేపట్టిందన్నారు. దేశంలోని అన్ని మహా నగరాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. రైళ్లలో నీటిని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితులు రావొద్దని ముందుచూపుతో సీఎం కేసీఆర్ తాగునీటి సమస్య లేకుండా చేశారు. రాష్ట్రమంతటా ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీరందిస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు.