చారిత్రక హైదరాబాద్ అభివృద్ధిలో పాతనగర ప్రగతికి ప్రాధాన్యత ఇస్తున్నామని, గడిచిన ఎనిమిదేండ్లలోనే ఓల్డ్సిటీ అద్భుతమైన అభివృద్ధి సాధించిందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. పాతనగరం అభివృద్ధిపై మంగళవారం నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయం (హెచ్జీసీఎల్)లో మంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా నగరం నలుమూలలా అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్ ఎస్ఆర్డీపీ ద్వారా పాతబస్తీలో రహదారి వ్యవస్థను బలోపేతం చేశామని, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, మూసీపై బ్రిడ్జిల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణంతో పాటు తాగునీటి కోసం సుమారు రూ. 1200 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. అలాగే ప్రజల ఆరోగ్యం కోసం పాతబస్తీలో ఇప్పటికే 84 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షిస్తున్నామన్న మంత్రి కేటీఆర్ మీర్ ఆలం మండి పునరుద్ధరణకు, మీరాలం ట్యాంక్పై ఆరు లేన్ల కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 07 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ అభివృద్ధిలో పాతనగరం ప్రగతికి ప్రాధాన్యత ఇస్తున్నామని, గడిచిన 8 సంవత్సరాలలో పాతనగరం అద్భుతమైన ప్రగతిని సాధించిందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పాతనగరం (ఓల్డ్ సిటీ) అభివృద్ధిపై మంగళవారం నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయం( హెచ్జీసీఎల్)లో మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పాతబస్తీ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అధికారులు ఈ సమావేశంలో అందజేశారు.
హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తొలి రోజు నుంచి పాటుపడుతూ వస్తున్నదని, ఇప్పటికే హైదరాబాద్ నగరం నాలుగు దిశలా విస్తరిస్తూ అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా నగరాన్ని నలు మూలల అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటిదాకా ఇదే ఆలోచనతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.
రెండున్నర లక్షల నల్లా కనెక్షన్లు
ప్రతి ఒకరికి సరిపడా తాగునీరు అందించాలన్న ఒక బృహత్ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకుపోతున్నదని, అందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని తాగునీటి సరఫరా సంతృప్తికర స్థాయిలో ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. గత 8 సంవత్సరాలలో ఓల్డ్సిటీ పరిధిలోను తాగునీరు సరఫరా మెరుగుపడిందన్నారు. ఇందుకోసం వివిధ తాగునీటి సౌకర్యాల అభివృద్ధి కోసం సుమారు రూ.1200 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత తాగునీటి సరఫరా పథకంలో భాగంగా రెండున్నర లక్షలకుపైగా నల్లా కనెక్షన్ల ద్వారా ఉచిత తాగునీరు అందుతుందని కేటీఆర్ తెలిపారు.
పెద్ద ఎత్తున రోడ్లు, విస్తరణ పనులు..
జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ఆర్డీపీ కార్యక్రమంలో భాగంగా పాతబస్తీ ప్రాంతంలోనూ భారీగా రోడ్డు నెట్వర్క్ బలోపేతానికి సంబంధించిన కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, ఇందులో ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు, రోడ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం కింద దాదాపు వందల కోట్లతో నిధులతో అనేక పనులు కొనసాగుతున్నాయని వివరించారు. జీహెచ్ఎంసీ చేపట్టిన సీఆర్ఎంపీ కార్యక్రమం ద్వారా ప్రధాన రోడ్ల నిర్వహణ కూడా ప్రభావవంతంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
జనావాసాలు అధికంగా ఉన్న పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ కార్యక్రమం కొంత సవాల్తో కూడుకున్నదని, అయితే రోడ్డు వైడనింగ్ తప్పనిసరి అయిన ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను అదేశించారు. పాతనగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమైన మరిన్ని భూసేకరణ నిధులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే ట్రాఫిక్ జంక్షన్లతోపాటు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, అవసరమైన చోట మూసీపై బ్రిడ్జిల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. చార్మినార్ వద్ద పాదాచారుల ప్రాజెక్టు పనులు సైతం దాదాపుగా పూర్తి కావచ్చాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
మీరాలం చెరువుపై ఆరు లైన్ల కేబుల్ బ్రిడ్జి..
హైదరాబాద్తో పాటు పాత నగరంలోనూ విద్యుత్ సరఫరా వ్యవస్థ అద్భుతంగా మెరుగైందని చెప్పారు. పారిశుధ్య నిర్వహణ విషయంలోనూ జీహెచ్ఎంసీ తీసుకున్న ప్రత్యేక చర్యలతో పరిస్థితి గతం కంటే చాలా పురోగతి ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, మదీనా, మకా మసీద్, సాలార్జంగ్ మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ నిర్వహణపైన ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి చెప్పారు. వైద్య ఆరోగ్య రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాల అమలుతో పాటు, ప్రత్యేకంగా 84 బస్తీ దవాఖానలను ఇప్పటి దాకా ఓల్డ్సిటీలో ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ వివరించారు. మీరాలం ట్యాంక్ పైనుంచి ఆరు లైన్ల కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రతిపాదనలు సైతం డీపీఆర్ దశలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న అనేక వారసత్వ కట్టడాలు, వారసత్వ సంపద ప్రధానంగా ఓల్డ్సిటీలో ఉన్న నేపథ్యంలో, వాటిని రక్షించడంతోపాటు పునరుజ్జీవన కార్యక్రమాలను సైతం పెద్ద ఎత్తున చేపట్టిన అంశాన్ని కేటీఆర్ ఈ సమావేశంలో ప్రస్తావించారు.
ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు
పాతనగరం ప్రగతికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధానంగా మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను, క్షేత్రస్థాయిలో తాము అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో ప్రభుత్వ శాఖలతో కలిసి పని చేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి మహమూద్ అలీ, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కూమారి, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కూమార్, తదితరులు పాల్గొన్నారు.
– అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే