‘చారిత్రక నేపథ్యమున్న నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. దశాబ్దాలుగా కుచించుకపోయిన నాలాలను విస్తరించి వరద సాఫీగా పోయేలా చేయాలి. గతేడాది భారీ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పదేపదే ఈ సమస్య పునరావృతం కాకుండా నాలాలను సమూలంగా ప్రక్షాళన చేయాలి. విస్తరణకు కావాల్సిన అడ్డంకులను అధిగమించండి. ఈ పనుల్లో ఆస్తులు కోల్పోతున్న పేదలకు మానవతా దృక్పథంతో డబుల్ బెడ్రూం ఇండ్లల్లో ప్రాధాన్యం కల్పించాలి. నాలాల విస్తరణతోపాటు రిటైనింగ్ వాల్స్ పటిష్టంగా నిర్మించాలి.
తొలిదశలో చేపట్టే విస్తరణ పనుల్ల్లో ప్రతిసారి ముంపునకు కారణమవుతున్న బాటిల్ నెక్స్ (బాగా కుచించుకు పోయినప్రాంతం)లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. నాలాలు, చెరువుల రక్షణ, అభివృద్ధి కోసం అవసరమైతే ప్రత్యే క చట్టాన్ని తీసుకొచ్చే యోచన చేస్తున్నాం. దీనిపై త్వరలో నగర ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహి స్తాం’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నాలాల విస్తరణ, ఎస్ఎన్డీపీ పనుల పురోగతిపై మంగళవారం మంత్రి బుద్ధభవన్లో బల్దియా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి నాలాల సర్వే వివరాలను జోనల్ కమిషనర్లు మంత్రికి కూలంకషంగా వివరించారు.
గ్రేటర్లో వరద సమస్యలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలకు నడుం బిగించింది. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన సర్కారు నాలాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా భారీ ప్రణాళికలను రూపకల్పన చేసింది. వరద నీరు సాఫీగా మూసీలోకి వెళ్లేలా తక్షణ చర్యలకుగానూ ప్రభుత్వం రూ. 858 కోట్లు కేటాయించగా, పనులను మొత్తం 15ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో భాగంగానే ఆరు జోన్ల పరిధిలో రూ. 609 కోట్ల అంచనాలో కొన్ని ప్యాకేజీలకుగానూ రూ. 267.07కోట్ల పనులను ప్రారంభించారు. ఈ క్రమంలోనే నాలా విస్తరణ పనులు సవ్యంగానే సాగేలా మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ మేరకు జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో నాలాల పొడవునా సర్వే చేపట్టారు. విస్తరణకు అవసరమైన భూసేకరణకు రంగం సిద్ధం చేయగా, అక్రమణల తొలగింపులో అర్హులైన నిర్వాసితులకు రెండు పడక గదుల ఇళ్లను ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉందని చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలోని నాలాల విస్తరణ, అభివృద్ధి కోసం ఒక సమగ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలను రూపొందించింది. ఈ మేరకు బుద్ధభవన్లోని ఈవీడీఎం విభాగంలో మంగళవారం పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నాలాలకు రిటైనింగ్ వాల్ కట్టి, వాటిని బలోపేతం చేయడం వంటి ప్రణాళికలపై ఇప్పటికే పలు ప్రాథమిక సమావేశాలు నిర్వహించిన మంత్రి కేటీఆర్, అన్ని జోన్లలో త్వరలో ప్రారంభించనున్న నాలాల అభివృద్ధి కార్యక్రమాలపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో దశాబ్దాలుగా నాలాలు కుంచించుకుపోయాయని, నాలాల బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ దిశగా తాము సమగ్ర ప్రణాళికలతో ప్రత్యేకంగా పని చేస్తున్నామని చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నందున నగరంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్న నేపథ్యంలో ఈ నాలాల విస్తరణ, బలోపేతం అత్యంత ఆవశ్యకమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
వరదల వలన నగర పౌరులకు ఎలాంటి నష్టం జరగకూడదనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నాలా విస్తరణ వలన ప్రభావితమయ్యే పేదల విషయంలో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తదని, వీరిలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. నాలాలు, చెరువుల రక్షణ, అభివృద్ధికి అవసరమైతే ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకువచ్చేందుకు యోచిస్తున్నామన్నారు. నగర ఎమ్మెల్యేలతో నాలాల విస్తరణపై త్వరలోనే ఒక సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇదిలా ఉంటే త్వరలో చేపట్టనున్న నాలాల అభివృద్ధిపైన జోనల్ కమిషనర్లు ఈ సమావేశంలో మంత్రికి వివరాలు అందించారు. మొదటి దశలో చేపట్టే నాలాల విస్తరణతోపాటు, ప్రతిసారి భారీ వర్షాల వలన వరదకు కారణం అవుతున్న బాటిల్ నెక్స్ ( నాలాలు బాగా కుంచించుకుపోయిన ప్రాంతాలను) గుర్తించి, వాటి విస్తరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, సీసీపీ దేవేందర్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్, హెచ్ఎండీఏ సీఈ బీఎల్ఎన్ రెడ్డి, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఔటర్ రింగు రోడ్డు వరకు నాలాలను భద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా జోన్కు ఒక నాలాను తొలి ప్రాజెక్టుగా చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు జోన్లో సమస్యాత్మకమైన ఒక నాలాను ఎంపిక చేసి, దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిద్దామని మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. ఎంపిక చేసిన నాలాల పొడవునా ఎన్ని అక్రమణలు ఉన్నాయి? ఆయా నిర్మాణాలను ఎంత మేర తొలగించాలి? వాటిలో నివసిస్తోన్న ప్రజల ఆర్థిక స్థితిగతులు, సామాజిక పరిస్థితుల వివరాలు సేకరిస్తున్నారు.