ప్రపంచ ప్రాముఖ్యత గల నగరంగా ఎదిగిన హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి ఏ మాత్రం సహకారం, సాయం అందకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి ప్రపంచ నగరాల సరసన నిలుపున్నదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం శాసనసభలో పద్దులపై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు.
రాజధానికి నీటి కొరత లేకుండా…
రాజధాని ఎంత విస్తరించినా నీటి కొరత రావొద్దనే ఉద్దేశంతో హెచ్ఎండబ్ల్యూఎస్కు రూ.2381.52 కోట్ల బడ్జెట్ కేటాయించాం.
2050 వరకు హైదరాబాద్కు తాగునీటి కష్టాలు రాకుండా సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాం. ఇందుకోసం బడ్జెట్లో రూ.725 కోట్లు కేటాయించాం.
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ నగర ప్రజలకు 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా అందిస్తామని ఇచ్చిన హామీని ఇప్పటికే నెరవేర్చాం. దీనివల్ల ఏర్పడే రూ.480 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఇందుకోసం ఈ ఏడాదికి జలమండలికి రూ.250 కోట్లు కేటాయించాం.
రహదారులకు ప్రత్యేక ప్రాధాన్యం…
ఎస్ఆర్డీపీలో భాగంగా ైప్లెఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జిలు, ఆర్యూబీ, ఆర్వోబీలు ఇలా 19 ప్రాజెక్టులు పూర్తి చేశాం.
సీఆర్ఎంపీ కింద రాబోయే ఐదేండ్లలో నగరంలోని 710 కిలోమీటర్ల రహదారుల నిర్వహణ ప్రైవేటు వారికి అప్పగిస్తాం. ఇందుకోసం రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
మిస్సింగ్ రోడ్స్, లింక్ రోడ్స్ కోసం కొత్త కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటికే 130 రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాం. ఇప్పటికే ఇందులో 23 రోడ్లు పూర్తి చేశాం.
కూకట్పల్లి, కుత్బుల్లాపూర్,కంటోన్మెంట్ నియోజకవర్గాల పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బాలానగర్ వద్ద రూ.387 కోట్లతో ైప్లెఓవర్ నిర్మాణ పనులు తుదిదశకు చేరాయి. రెండునెలల్లో ప్రారంభించబోతున్నాం.
మెహిదీపట్నం, ఉప్పల్లో రెండు ఆధునికమైన స్కైవాక్ నిర్మాణాలను ప్రారంభించాం.
ఔటర్ రింగు రోడ్లో ఇప్పుడున్న 19 ఇంటర్ ఛేంజ్లకు అదనంగా కొత్త ఎగ్జిట్లను ఏర్పాటు చేస్తాం.
మరికొన్ని అంశాలు…
జీహెచ్ఎంసీలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. వీటిని అతి త్వరలో ప్రజలకు అందిస్తాం.
పేదలకు సుస్తీ చేస్తే వారు వ్యయప్రయాసలు పడకుండా ఉండేందుకు 229 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశాం. త్వరలోనే వీటిని 300లకు పెంచబోతున్నాం. ఇందుకోసం బడ్జెట్లో రూ.107 కోట్లు కూడా కేటాయించుకున్నాం.
మూసీరివర్డెవలప్మెంట్ కార్పొరేషన్కు రూ.200 కోట్లు.
కరోనా కష్టకాలంలో 292 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా 90 లక్షల మందికి కడుపు నిండా అన్నం పెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. రూ.5కే భోజనంతో ప్రతిరోజు 70 వేల మందికి అన్నం పెడుతున్నాం.
కోకాపేటలో రూ. 268 కోట్లతో కొత్త లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నాం. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.2500 కోట్ల ఆదాయం సమకూరనుంది.
బీపాస్ ద్వారా 21 రోజుల్లో అనుమతి రానిపక్షంలో 22వ రోజు ఆటోమెటిక్గా అనుమతి వచ్చినట్లుగా భావించే కొత్త చట్టాన్ని దేశానికి ఆదర్శంగా తీసుకొచ్చాం.
g 10 గ్రీన్ బడ్జెట్లో భాగంగా హెచ్ఎండీఏ పరిధిలో 35 కోట్ల మొక్కలు నాటాం. హెచ్ఎండీఏ చుట్టు పక్కల ఆరు వేల హెక్టార్లలో 16 లంగ్స్ స్సేస్లను అభివృద్ధి చేస్తున్నాం.
ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 34 శాతం వ్యాక్సిన్లు కేవలం హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయి.
70 దేశాల రాయబారులు వచ్చి బయోలాజికల్ ఈవెంట్స్ను, భారత్ బయోటెక్ను ఇతర సంస్థలను పరిశీలించి, తమ దేశానికి సహకరించాలని కోరాయి.
6.67 లక్షల కుటుంబాలను ఆదుకున్నాం..
వందేండ్ల తర్వాత కురిసిన అతి భారీ వర్షానికి తల్లడిల్లిన నగర ప్రజల్ని ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున 6.67 లక్షల కుటుంబాలను ఆదుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రూ.64 కోట్లు ఇచ్చామని చెప్పారు. విపత్తు వల్ల నష్టపోయిన వారికి సాయమందించేందుకు రూ.1350 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరినా.. ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నాలాల అభివృద్ధికి రూ.830 కోట్లు కేటాయించాలని రాసిన లేఖకు కూడా స్పందన లేదన్నారు కేటీఆర్.
జీహెచ్ఎంసీలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు దాదాపు పూర్తి కావొచ్చాయని.. సాధ్యమైనంత త్వరగా వీటిని అర్హులైన నిరుపేదలకు అందించనున్నట్లు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దేశంలో మరే నగరంలో లేని విధంగా రూ.9714 కోట్లతో స్లమ్ ఫ్రీ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేస్తున్నామన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం పురపాలకశాఖ పద్దుపై మంత్రి కేటీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ అభివృద్ధిని ప్రభుత్వం ప్రత్యేక ఎజెండాతో ముందుకు తీసుకుపోతున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వకున్నా ఆరేండ్లలో అక్షరాలా అరవై ఏడు వేల కోట్ల రూపాయలకుపైగా వెచ్చించి నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు.