హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు. రూ.12 వందల కోట్లతో యదాద్రి (Yadadri) ఆలయ పునర్నిర్మింపజేశారని, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా.. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మండలం పుప్పాలగూడలోని సంకటహరణ శ్రీ హనుమాన్ ఆలయాన్ని (Hanuman Temple) సందర్శించారు. స్వయంభువుగా వెలసిన హనుమాన్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వీ. ప్రకాశ్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సంకట హరణ హనుమాన్ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ.ప్రకాశ్, ఆలయ పాలక మండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.