వైద్యశాలకు రాఘవరావు, వెంకటమ్మ పేరు పెట్టాలి: ఎమ్మెల్యే దానం
ఖైరతాబాద్ 50 పడకల ప్రభుత్వ దవాఖాన ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్రావు
ఖైరతాబాద్, మార్చి 16 : కరోనా అయిపోయిందని, ఇక లేదని కొందరు అనుకుంటున్నారని, దాని ప్రభావం తగ్గింది తప్ప.. వైరస్ ప్రమాదం ఇంకా పొంచే ఉన్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. బుధవారం ఖైరతాబాద్లో ఏర్పాటు చేసిన 50 పడకల ప్రభుత్వ దవాఖానను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేటర్ విజయారెడ్డితో కలిసి ప్రారంభించారు. పలు వార్డులను సందర్శించి ఆయా సేవలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా 12-14 సంవత్సరాల పిల్లలకు రాష్ట్ర వ్యాప్త వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఉద్యోగులు, సిబ్బంది చాలా బాగా పనిచేశారని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 5.94 కోట్ల డోసులు వేశామని వెల్లడించారు.
ఖైరతాబాద్ 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి కల్వకుంట్ల రాఘవరావు, వెంకటమ్మ స్మారక దవాఖానగా నామకరణం చేయాలని మంత్రి హరీశ్రావును ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. ఖైరతాబాద్ ప్రజల చిరకాల వాంఛ 50 పడకాల ఆస్పత్రి అందుబాటులో తీసుకురావాలని మంత్రి హరీశ్ రావును కోరిన వెంటనే తగిన పరికరాలు, ఏర్పాట్లు చేశారని చెప్పారు. స్థానిక బస్తీలకు చెందిన సుమారు ఐదులక్షల మందికి పైగా ఈ వైద్యశాలలో సేవలు పొందే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత ఖైరతాబాద్ పీహెచ్సీ కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించాలని సంకల్పించామని చెప్పారు. అనంతరం కరోనా సమయంలో సేవలందించిన ఖైరతాబాద్, చింతలబస్తీ పీహెచ్సీకి సంబంధించిన ఆశా వర్కర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కె. ప్రసన్న రామ్మూర్తి, వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, బయాలజిక్- ఈ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎ. సునీత, జిల్లా ఇమ్యూనైజషన్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకళ, ఖైరతాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఇన్చార్జి వైద్యురాలు డాక్టర్ కల్యాణి, ఎస్పీహెచ్వో డాక్టర్ నాగేంద్ర, ఖైరతాబాద్ యూపీహెచ్సీ డాక్టర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్లో పిల్లలకు టీకా షురూ..
సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలో 12-14 మధ్య వయసు ఉన్న పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ బుధవారం ప్రారంభమైంది. ప్రపంచ టీకా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 1.97 లక్షల మంది పిల్లలను గుర్తించామని, వ్యాక్సినేషన్ను వేగవంతం చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కూడా టీకా వేసేలా చర్యలు చేపట్టనున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు.