ఖైరతాబాద్, సెప్టెంబర్ 13: మండల పరిషత్లకు కేటాయించిన రూ.500 కోట్ల నిధుల విడుదల కోసం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడీల కుమార్ గౌడ్ కోరారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సోమవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం తరపున మంత్రికి మొక్కను, వినతి పత్రాన్ని అంజేశారు. మండల పరిషత్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తమ ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం రూ.500 కోట్లతో పాటు ప్రతి సభ్యునికి రూ.20 లక్షలు, సంవత్సరానికి రూ.1,200 కోట్ల బడ్జెట్ను కేటాయించాలన్నారు. మంత్రి దయాకర్ రావు సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి త్వరలోనే నిధుల మంజూరీకి కృషి చేస్తానన్నారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, కోశాధికారి మన్నె రాజు, నాయకులు కుమార్, అశోక్ తదితరులు ఉన్నారు.