మేడ్చల్, మే 12 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తున్నదని, మరింత అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. శుక్రవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అధ్వర్యంలో అభివృద్ధి పనులపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని చెప్పారు.
మున్సిపాలిటీలు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి నిధులకు ఎలాంటి కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. మున్సిపాలిటీల పరిధిలో డబుల్బెడ్రూంలు, రహదారులు, వెజ్-నాన్వెజ్ మార్కెట్లు, వైకుంఠధామలు, డంప్యార్డులు, దోభీఘాట్లు, స్టేడియంల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.