రైతుల పీఎం కిసాన్ నగదు సులభంగా విత్డ్రా
రోజుకు రూ.10వేలు మాత్రమే..
సిటీబ్యూరో, 2 జూన్(నమస్తే తెలంగాణ) : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు విడుదల చేసిన నగదును విత్ డ్రా చేసుకునేందుకు పోస్టాఫీసు అధికారులు మైక్రో ఏటీఎం, పోస్టల్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఏటీఎంల ద్వారా రైతులు నగదును సులభంగా విత్ డ్రా చేసుకోవచ్చని హైదరాబాద్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్, పోస్టుమాస్టర్ జనరల్ జె.శ్రీనివాస్ తెలిపారు.
మొత్తం 5118 పోస్టాఫీసుల్లో ఈ మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలకు వెళ్లలేని వారి కోసం పోస్టల్ మైక్రో ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ మైక్రో ఏటీఎం నుంచి నగదును విత్డ్రా చేసుకునే వారు ఆధార్కార్డు, మొబైల్ ఫోన్ను తీసుకురావాలి సూచించారు. బ్యాంక్ ఖాతాకు ఉన్న మొబైల్ ఫోన్కు వచ్చే ఓటీపీలను పోస్టుమాస్టర్కు తెలిపి నగదును విత్డ్రా చేసుకోవాలని శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏటీఎంల నుంచి రోజుకు 10వేలు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం కలించినట్లు పేర్కొన్నారు. జనవరిలో ఈ పోస్టల్ మైక్రో ఏటీఎంల ద్వారా రూ.16.12 కోట్లు చెల్లించామన్నారు.