Hyderabad Metro | సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరంలో మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిన 7 మెట్రో కారిడార్లలో మొత్తం 70 కి.మీ మేర నిర్మించే మార్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో సర్వేలు, ట్రాఫిక్ అధ్యయనం, మెట్రో స్టేషన్లు, డిపోల నిర్మాణం వంటి అంశాలపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సిస్ట్రా కన్సల్టెన్సీ సంస్థతో పనిచేస్తూ డీపీఆర్ను రూపొందిస్తున్నది. డీపీఆర్ను రూపొందించేందుకు అవసరమైన క్షేత్ర స్థాయి అధ్యయనం పూర్తికావచ్చిందని, జూన్ నెలలోనే డీపీఆర్ను ప్రభుత్వానికి అందజేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని మెట్రో అధికారి ఒకరు తెలిపారు. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా, విమానాశ్రయానికి మెట్రో రైలు మార్గం ద్వారా కనెక్టివిటీ ఉండేలా రెండో దశ మెట్రో నిర్మాణాన్ని 70 కి.మీ మేర చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా 7 మార్గాల్లో అధ్యయనం చేసి డీపీఆర్ను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.20వేల కోట్ల వ్యయం అవుతుందని ఇప్పటికే మెట్రో అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో దీనిపై ప్రకటనలు చేయకుండా, జూన్ 4 తర్వాత కోడ్ ముగిసిన వెంటనే రెండో దశ మెట్రోకు సంబంధించిన డీపీఆర్లను ప్రభుత్వానికి అందజేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. పూర్తయిన డీపీఆర్లను సీఎం పరిశీలనకు పంపిన తర్వాత కారిడార్ల వారీగా టెండర్లు పిలిచే ప్రక్రియను మొదలు పెట్టనున్నారు.
ఎక్కువ మంది నగర వాసులకు ప్రయోజనం కలిగేలా మెట్రో రైలు రెండో దశను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రధానంగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు అనుసంధానం చేసే మార్గాన్ని నాగోల్ నుంచి ఎల్బీనగర్ మీదుగా చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి, జల్పల్లి, మామిడిపల్లి కలుపుతూ విమానాశ్రయం లోపలి వరకు మెట్రో రూట్ను 29 కి.మీ మేర ఖరారు చేశారు. దీంతో పాటు ఇతర మార్గాలకు సంబంధించిన తుది రూట్ మ్యాప్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ మెట్రో అధికారులు సిద్ధం చేశారు. కొత్తగా ఖరారు చేసిన మొత్తం 70 కి.మీ మెట్రో మార్గాల్లో వివిధ ప్రాంతాలను కలుపుతూ ఉండగా, అందులో అతి పొడవైన మెట్రో మార్గంగా నాగోల్-శంషాబాద్ ఎయిర్పోర్టు ఉంది. దీని తర్వాత మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరు వరకు 14 కి.మీ, రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) వరకు 8 కి.మీ, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్నగర్ వరకు 8 కి.మీ, మైలార్దేవ్పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు 4 కి.మీ, ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కి.మీ, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కి.మీ చొప్పున మొత్తం 70 కి.మీ మెట్రో మార్గాన్ని 7 కారిడార్లుగా విభజించి డీపీఆర్లు రూపొందిస్తున్నారు. కాగా ఇందులోఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కి.మీ మార్గాన్ని మొదటి దశలోనే ప్రతిపాదించారు. మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంలో ఎంతో అనుభవం ఉన్న సిస్ట్రా కన్సల్టెన్సీ సంస్థ ప్రభుత్వం నిర్ధేశించిన మార్గాలకు వేర్వేరుగా డీపీఆర్లను రూపొందిస్తున్నది. నగరంలోని అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు కనెక్టివిటీని విస్తరించడం ద్వారా భారీ సంఖ్యలో పేద, మధ్యతరగతి వర్గాలకు మెట్రో రైలు సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మార్గాలను ఎంపిక చేసింది.
మొదటి దశలోని కారిడార్-3 (నాగోల్ -రాయదుర్గం) 29 కి.మీ ఉండగా, రెండో దశలో నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మరో 29 కి.మీ, అదేవిధంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు 8 కి.మీ కలిపి మొత్తం 66 కి.మీ మెట్రో మార్గం అనుసంధానం కానున్నది. దీంతో ఈ మెట్రో మార్గం పొడవు 66 కి.మీ. కాగా నగరంలోనే అత్యంత పొడవైన మెట్రో మార్గంగా మారనున్నది. ఆ తర్వాత మొదటి దశలో కారిడార్-1(మియాపూర్-ఎల్బీనగర్ 29 కి.మీ) రెండు వైపులా ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు 8 కి.మీ, మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరువు వరకు మరో 14 కి.మీ కలిపి మొత్తం 51 కి.మీ పొడవుతో నిర్మాణం కానున్నది. దీనివల్ల నగరంలో ఎక్కడ ఉన్నా శివారు ప్రాంతాలకు మెట్రో మార్గాల ద్వారానే వేగంగా తమ గమ్య స్థానాలకు చేరుకునేలా నిర్మిస్తున్నారు.
కారిడార్ 2 : ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు (5.5 కి.మీ)( మొదటి దశలో ప్రతిపాదించిన మార్గం)
కారిడార్ 2 : ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు (1.5 కి.మీ)
కారిడార్ 4 : నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మీదుగా చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (మొత్తం 29 కి.మీ)
కారిడార్ 4 : మైలార్దేవ్పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు (4 కి.మీ)
కారిడార్ 5 : రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్) వరకు (8 కి.మీ)
కారిడార్ 6 : మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరు వరకు (14 కి.మీ)
కారిడార్ 7 : ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్నగర్ వరకు (8 కి.మీ)