ఫుల్ స్పీడుతో రైళ్లను నడిపేందుకు ‘మెట్రో రైల్ సేఫ్టీ’ ఆమోదం
ఆమోదించిన సీఎంఆర్ఎస్
నాగోలు-రాయదుర్గం మార్గంలో 6 నిమిషాలు,
ఎల్బీ నగర్-మియాపూర్ మార్గంలో 4 నిమిషాలు ఆదా
అందుబాటులోకి సూపర్ సేవర్ కార్డు
ఇప్పటిదాకా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న మెట్రో రైళ్లు మరింత స్పీడు పెంచనున్నాయి. ఇక నుంచి 80 కిలోమీటర్ల స్పీడుతో దూసుకుపోనున్నాయి. ఇందుకు అనుగుణంగా మెట్రో రైలు సంస్థ సిగ్నలింగ్ సాఫ్ట్వేర్లో అవసరమైన మార్పులు చేసింది. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) బృందం పరిశీలన చేసి ఆమోదం తెలిపింది. అధిక వేగంలోనూ రైలు సాఫీగా సాగిపోయేలా అన్ని భద్రత చర్యలు తీసుకున్నట్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాలు, నాగోలు నుంచి రాయదుర్గం మార్గంలో 6 నిమిషాలు సమయం ఆదా కానుందని ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. కాగా ప్రతి ఆదివారం, రెండో, నాలుగో శనివారం, పండుగ రోజుల్లో కేవలం 59 రూపాయల టికెట్తో రోజంతా ప్రయాణించేలా రూపొందించిన సూపర్ సేవర్ స్కీంను శనివారం నుంచి అమలు చేశారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): సులభతర ప్రయాణానికి, ఆహ్లాదానికి మారుపేరు మెట్రో రైలు. నగర అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం చేయడం దీని ప్రత్యేకత. అయితే, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెట్రోరైలు సంస్థ గరిష్ట వేగాన్ని పెంచింది. పూర్తిస్థాయి వేగంతో మెట్రోరైళ్లను నడిపేందుకు ‘కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేప్టీ’ (సీఎంఆర్ఎస్) నుంచి ఎల్ అండ్ టీ మెట్రోరైలు ఆమోదం పొందింది. గత మూడు రోజులుగా మూడు మెట్రో కారిడార్లలో సీఎంఆర్ఎస్ ఉన్నతాధికారి జనక్ కుమార్ గార్గ్ ఆధ్వర్యంలో బృందం పరిశీలన చేసింది. ఎల్ అండ్ టీ మెట్రోరైలు సంస్థ తమ సిగ్నలింగ్ సాఫ్ట్వేర్కు తగిన మార్పులను చేయడం ద్వారా రైళ్లు పూర్తి వేగంతో నడిచేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇక నుంచి మెట్రో గంటకు 80 కి.మీ వేగంతో పరుగులు పెట్టనున్నాయి.
సమయం ఆదా..
నగరంలో మెట్రోరైలు సేవలు ప్రారంభమై నాలుగేండ్లు పూర్తయ్యాయి. 2017 నవంబర్ 29న మొదటి దశ మెట్రో సేవలు ప్రారంభమైన నాటి నుంచి గంటకు 40 కి.మీ, 60 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. సీఎంఆర్ఎస్ అనుమతి మేరకు మూడు కారిడార్లలో పరిమిత వేగంతోనే నడిపారు. తాజాగా అత్యధిక వేగం 80 కి.మీకు అనుమతి రావడంతో కారిడార్-1 (మియాపూర్ – ఎల్బీ నగర్)లో 4 నిమిషాలు, కారిడార్-2 (జేబీఎస్-ఎంజీబీఎస్)లో 1.15 నిమిషాలు, కారిడార్-3 (నాగోలు-రాయదుర్గం)లో 6 నిమిషాలు ఆదా కానున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు. సిగ్నలింగ్ సాఫ్ట్వేర్ను ఆధునీకరించడం వల్ల మెట్రోరైళ్లు గరిష్ట వేగంతో ప్రయాణించే అవకాశం కలిగిందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్ తెలిపారు.